కాస్త ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటున్నా, కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు.దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడడంతో బిజెపి హవా రాబోయే ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపించే అవకాశం కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు బలం పెంచుకుంటున్నా, మోదీ తన మాయాజాలంతో మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.అందుకే టిడిపి అధినేత చంద్రబాబు సైతం మోదీ దయాదాక్షిణ్యాల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
ఏపీలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాబోయే రోజుల్లో తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం చూసుకుంటే ఏపీలో బీజేపీ వైసీపీ ల మధ్య కాస్త మాటల యుద్ధం జరుగుతోంది.
ఎన్నికల దగ్గర నుంచి చూసుకుంటే ,రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది.ఒకరికొకరు సహకరించుకుంటూ వస్తున్నారు.వీలైనప్పుడల్లా ఏపీ సీఎం జగన్ కేంద్ర బీజేపీ పెద్దలను కలిసి అన్ని విషయాల పైన క్లారిటీ ఇస్తూ వస్తున్నారు.అలాగే కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతు ఇస్తూ వస్తున్నారు.
కానీ ఇప్పుడు అదే పరిస్థితి ముందు ముందు కొనసాగిస్తే ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని జగన్ గ్రహించినట్లు గా కనిపిస్తున్నారు.ప్రస్తుతం నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పెద్దఎత్తున రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
దీనిలో భాగంగానే భారత్ బంద్ కు పిలుపు నిచ్చారు.దీనికి బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్ని మద్దతు ఇచ్చాయి.
తెలంగాణ ప్రభుత్వం సైతం భారత్ బంద్ కు మద్దతుగా వ్యవహరించింది.ఇది ఇలా ఉంటే ఏపీ బంద్ కు మద్దతుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
ఏపీలో ఈ బంద్ సక్సెస్ అయ్యేలా ప్రభుత్వమే చూడడం వెనుక రాజకీయం ఏమిటనేది బీజేపీ నేతలకు అర్థం కావడం లేదు.తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ బంద్ కు మద్దతు ఇచ్చారు అంటే దానికి ఒక అర్థం ఉంది.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
ఒకరికొకరు రాజకీయంగా పై చేయి సాధించేందుకు పోరాటం చేస్తున్నారు.కానీ ఏపీ సీఎం జగన్ ఈ విధంగా వ్యవహరించడం అనేక సందేహాలకు తావిస్తోంది.చాలా విషయాలలో కేంద్రం ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నా, నిధులు విషయానికి వచ్చేసరికి మొండిచేయి చూపిస్తున్నారని, అది కాకుండా తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశంతో బిజెపి పూర్తిగా తమ టార్గెట్ చేసుకుందని , దీనిని ఆషామాషీగా వదిలిపెడితే ఏపీలో తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి గా బిజెపి మారే అవకాశం ఉందనే ఒక అభిప్రాయానికి వచ్చిన జగన్ బిజెపి తో ఇక తాడోపేడో తెల్చేసే పనిలో ఉన్నారు.
దీని కారణంగా తలెత్తే రాజకీయ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధమైనట్లుగా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ పరిణామాలు ఎక్కడ వరకు దారితీస్తాయి అనే విషయాన్ని జగన్ లెక్కలోకి తీసుకున్నారో లేదో అనే సందేహాలు వైసీపీ నేతల్లో నూ వ్యక్తమవుతున్నాయి.