రాజకీయాలను ఏవిధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటూ, ఏదో రకంగా ఎప్పుడూ తనదే పైచేయిగా ఉండేలా చేసుకోవడంలో టిడిపి అధినేత చంద్రబాబుది ఒక ప్రత్యేకమైన శైలి.ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నట్లు గానే ఆయన వ్యవహారం ఉంటుంది .
ప్రస్తుతం వైసీపీని రాజకీయంగా బలహీనం చేసి , ఆ పార్టీ పరిపాలన పై ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా చంద్రబాబు విమర్శలు ఉన్నాయి.అనేక సంక్షేమ పథకాలతో జనాల్లోకి జగన్ దూసుకుపోతూ ఉండడం తో ఆయన హవా తగ్గించేందుకు ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలోనే కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటం, సహజంగానే ప్రజల్లో ఈ విషయంపై ప్రభుత్వం ఏం చేయలేకపోతోంది అనే అభిప్రాయం ఉండడం వంటి వాటిని తనకు అనుకూలంగా మార్చుకుని చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.
మొదట్లో ఈ తరహా విమర్శలను దీటుగా ఎదుర్కొంటూ సమాధానం చెప్పిన వైసిపి ఇప్పుడు మాత్రం బాబు చేస్తున్న వ్యాఖ్యలపై కేసుల వరకు వెళ్తోంది.తాజాగా కర్నూలులో ఎన్ 440 – కె రకం వైరస్ వ్యాపించిందని , ఇది అత్యంత ప్రమాదకరమైన వైరస్ అంటూ చంద్రబాబు ప్రచారం చేయడంపై ఓ లాయర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతేకాదు గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో మరో లాయర్ అనిల్ కుమార్ పోలీసులకు ఇదే రకమైన ఫిర్యాదు చేశారు.రాష్ట్రంలో కరోనా మూటేటెడ్ వైరస్ ఎన్ 440 కె వైరస్ ఉందని చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ కేసు నమోదు అయింది .అయితే ఇటువంటి చిన్న చిన్న కేసులు ద్వారా చంద్రబాబు కలిగే నష్టం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు.ఇవన్నీ చాలా చిన్న చిన్న కేసులు .
కాకపోతే ఈ కేసుల ద్వారా వైసిపి తమను వేధిస్తోందని, ప్రజాప్రయోజనార్థం తాము ప్రశ్నిస్తుంటే, తమపై ఈ విధంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటూ చంద్రబాబు జనాల్లో సింపతి సంపాదించుకునే అవకాశం కల్పించారు.అంతేకాదు టీడీపీ అనుకూల మీడియా లోనూ బాబు పై కేసులు వ్యవహారంపై ఆయనకు సంపతి వచ్చే విధంగా కథనాలు ప్రచారం అవుతున్నాయి.మామూలుగానే చిన్న చిన్న విషయాలను సైతం రాజకీయంగా వాడుకుని లబ్ధిపొందాలని బాబు ప్రయత్నిస్తూ ఉంటారు.ఇప్పుడు ఈ రకమైన చిన్నా, చితకా కేసుల కారణంగా అనవసర సింపతీ బాబు కి కల్పించినట్లు అవుతోంది.
దీనివల్ల ఎక్కువ నష్టపోయేది వైసీపీనే.