విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించేందుకే కేంద్రం మొగ్గుచూపుతున్న సమయం నుంచి తీవ్ర స్థాయిలో విపక్షాలు, ఏపీ అధికార పార్టీ వైసీపీ తోపాటు, స్టీల్ ప్లాంట్ కార్మికులు ఇలా అంతా ఆందోళనలు నిర్వహించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతు తెలిపారు.ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడానికి కుదరదని, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదు అంటూ , గతంలోనే ఆయన విమర్శలు చేశారు.
ఇక ఈ విషయంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ నిరసనను తెలియజేస్తూ , కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.అయినా కేంద్రం నుంచి ఎటువంటి సానుకూలత రాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.
ఈ ఉద్యమానికి వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి.ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు భవిష్యత్ కార్యాచరణను విశాఖ ఉక్కు పోరాట కమిటీ ప్రకటించింది.
ఫిబ్రవరి 13వ తేదీన విశాఖ లో ఉన్న బిజెపి కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన పరిరక్షణ పోరాట కమిటీ ఫిబ్రవరి 23న విశాఖ బందుకు పిలుపు ఇచ్చారు.
విడతలవారీగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే స్టీల్ ప్లాంట్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి 365 రోజులు పూర్తవుతున్న సందర్భంగా మరింత ఉధృతంగా ఈ పోరాటం నిర్వహించాలని స్టీల్ ప్లాంట్ కార్మికులు డిసైడ్ కావడంతో మరోసారి ఈ అంశంలో ఏపీ అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసుకుంటుండగా , ఈ వ్యవహారంలో తమ ప్రమేయం ఏమీ లేదని, కేంద్ర అధికార పార్టీ బిజెపి తీసుకున్న నిర్ణయమని ఆ పార్టీని నిలదీయాలి కానీ తమ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని వైసిపి తమ వాదన ను ప్రజల్లోకి తీసుకు వెళుతోంది.