కేంద్ర అధికార పార్టీ బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా దానిని సద్వినియోగం చేసుకుంటూ, ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్.తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా బిజెపిని వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో ఫోకస్ చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా తెలంగాణలో తమకు ప్రధాన ప్రత్యర్ధిగా మారిన బీజేపీని ఇరుకున పెట్టేందుకు, కేంద్రంలో బిజెపి తీసుకుంటున్న నిర్ణయాలను, ప్రజావ్యతిరేక విధానాలను హైలెట్ చేసే పనుల్లోనూ కెసిఆర్ ఉన్నారు.దీనిలో భాగంగానే కేంద్రమే వరి ధాన్యం కొనాలని డిమాండ్ గత కొంతకాలంగా టిఆర్ఎస్ వినిపిస్తోంది.
దేశమంతా ఒకే విధమైన ధాన్యం సేకరణ పద్ధతి ఉండాలని టిఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
దీనిని మరింత హైలైట్ చేస్తూ ఉగాది తర్వాత నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ అంశంపై బిజెపిని ఇరుకున పెట్టే విధంగా టిఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది.
తెలంగాణలో వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలని టిఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, కేంద్రం మాత్రం రా రైస్ మాత్రమే కొంటామని చెబుతోంది.ఈ అంశంపైనే టీఆర్ఎస్ బీజేపీ మధ్య వివాదం నడుస్తోంది.
వచ్చేది బాయిల్డ్ రైస్ అయితే ముడి బియ్యం ఎక్కడ నుంచి తీసుకురావాలని కేంద్రాన్ని రాష్ట్రం ప్రశ్నిస్తుంది.ఇప్పుడు యాసంగి పంట చేతికి వస్తుంది.
ఈ ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారనే విషయంలోనూ ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు.అయితే టిఆర్ఎస్ మాత్రం పంజాబ్ తరహాలోనే ధాన్యాన్ని మొత్తాన్ని కేంద్ర కొనుగోలు చేయాలని, లేకపోతే బిజెపిని తరిమి కొడతారని హెచ్చరికలు చేస్తోంది.
అయితే ఇదంతా టిఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసమే చేస్తోందని, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపిని ఇరుకున పెట్టేలా టిఆర్ఎస్ వరి ధాన్యం అంశాన్ని తెరపైకి తెస్తున్నారనే విషయాన్ని బీజేపీ గుర్తు చేస్తోంది.ఇదే అంశంపై దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు టిఆర్ఎస్ సిద్ధమవుతుండగా, కాంగ్రెస్ ఈ వ్యవహారంపై స్పందించింది.టీఆర్ఎస్ బీజేపీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని విమర్శిస్తోంది.టిఆర్ఎస్ మాత్రం వరి ధాన్యం విషయంలో కేంద్రం తో తలపడేందుకు ముహూర్తం కూడా పెట్టుకుంది.ఉగాది తర్వాత నుంచి దేశవ్యాప్తంగా తమతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని, ఈ విధంగా కేంద్ర అధికార పార్టీ బిజెపిని ఇరుకున పెట్టాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది.