ప్రజలు రాజకీయాలను చూసే పద్ధతి వేరుగా ఆశించేది వేరుగా ఉంటుంది.రాజకీయాలలో ప్రజల మనస్సును గెలవడం ఆశామాషీ వ్యవహారం కాదు.
అంతేకాక అధికార పార్టీ ఇబ్బందులను తట్టుకొని పార్టీని నడిపించడం కార్యకర్తలను చూసుకోవడం, ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై పోరాడుతూ ప్రజల సమస్యలపై గళమెత్తితేనే ఏ పార్టీ అయినా ప్రజల్లోకి వెళ్లడం అన్నది జరుగుతుంది.అయితే సమస్యలపై పోరాడటం మాత్రమే నాయకత్వ లక్షణం అని అనుకుని చాలా మంది పొరబడతారు.
కానీ ప్రజలలోకి పార్టీ వెళ్ళాక ప్రజల అభిమానాన్ని ఓట్ల వైపు మలుచుకోవడం అన్నది నాయకుల నైపుణ్యం.ఓట్ల రూపంలో మలుచుకోవడంలో విఫలమైతే పార్టీ చాలా రోజులు ప్రజల్లో ఉండటం చాలా కష్టం.
కార్యకర్తలు కూడా ప్రజల్లో పార్టీ పట్ల స్పందన లేకుంటే నైరాశ్యంలో మునిగిపోతారు.రాను రాను పోరాట పటిమ కూడా నశిస్తుంది.
అచ్చం ఇలాంటి పరిస్థితి ఇప్పుడు టీజెఎస్ పార్టీలో ఉంది.తెలంగాణ ఉద్యమాన్ని అన్ని రకాల వర్గాలను ఏకం చేస్తూ తెలంగాణ సాధించడంలో కీలకపాత్ర పోషించిన కోదండరామ్ తెలంగాణ ఏర్పడిన తరువాత రకరకాల కారణాలతో కేసీఆర్ తో విభేదించి కొద్ది కాలం తరువాత తెలంగాణ జన సమితి పేరుతో పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే.అయితే పార్టీ ని ప్రారంభించినా ఆ తరువాత కొన్ని పార్టీలతో కలసి కేసీఆర్ కు వ్యతిరేకంగా కట్టిన కూటమిలో చేరినా కూటమి సత్తా చాటకపోవడంతో కొత్తగా ప్రారంభించిన పార్టీ అయిన తెలంగాణ జన సమితి కూడా ఫెయిల్యూర్ పార్టీగా ముద్రపడింది.ఇక రాను రాను ఏ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయకపోవడంతో పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేక పోయింది.
ఇందుకు కారణం ఏంటని మనం ఒకసారి విశ్లేషిస్తే కోదండరాం వ్యక్తిగతంగా నిజాయితీపరుడు.ప్రస్తుత రాజకీయాల్లో ధన బలం లేకపోతే రాజకీయాలు చేయలేని పరిస్థితి ఉంది.నిజాయితీ పరుడు కావడం, ధన బలం లేకపోవడమే టీజెఎస్ సత్తా చాటకపోవడానికి ప్రధాన కారణమని మనం చెప్పుకోవచ్చు.