ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే హడావుడి అప్పుడే మొదలైంది.నిన్న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో జగన్ ప్రస్తావించిన కొన్ని అంశాలు దీనికి సంకేతం గా మారాయి.
ఇప్పటి వరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పరిమితమైన జగన్ , అక్కడి నుంచే పరిపాలనను కొనసాగిస్తున్నారు.జనాల్లోకి ఎక్కువగా తిరిగేందుకు ఇష్టపడడం లేదు.
వైసీపీ ప్రభుత్వానికి 2024 వరకు తిరుగు లేకపోవడంతో, ఆ తర్వాత కూడా తమకు మళ్లీ అధికారం దక్కుతుందనే అంచనాలో జగన్ ఉంటూ వచ్చారు అయితే ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచుతూ ఉండడంతో, జగన్ సైతం ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.పార్టీలో క్షేత్రస్థాయి నుంచి ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు, పార్టీ నాయకులు వ్యవహార శైలి కారణంగా జనాల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది అనే విషయాన్ని జగన్ గుర్తించారు.
ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు, జనసేన – బీజేపీ లు బలపడేందుకు ప్రయత్నిస్తూ ఉండటం, 2024 ఎన్నికల్లో ఆ పార్టీలు అన్నీ కలిసి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం, వంటి పరిణామాలు జగన్ కు ఇబ్బంది కారంగా మారాయి.మరింత ప్రజా వ్యతిరేకత పెరగక ముందే , ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి అనే ఆలోచనలో జగన్ ఉండడంతో, టీడీపి కూడా అలెర్ట్ అయ్యింది.
ఏపీ లో ముందస్తు ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటి అనే విషయం పైనా టీడీపి లో చర్చ మొదలయ్యింది.అయితే వీటిని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా అంటే అది అనుమానంగానే చెప్పాలి.
ఇప్పుడు పార్టీ బలం పుంజుకుంటుంది అన్నట్లుగా పరిస్థితి ఉన్నా , పార్టీలోని గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి.ముఖ్యంగా లోకేష్ నాయకత్వాన్ని మెజార్టీ సీనియర్ నాయకులు ఒప్పుకోకపోవడం, అలాగే సీనియర్ నాయకులను పక్కన పెడుతున్నట్లుగా లోకేష్ వ్యవహరిస్తుండడం వంటి అంశాలపై కొద్ది రోజుల క్రితం పార్టీ సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు.
ఇక ఏపీ టిడిపి అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు వ్యవహారశైలి వివాదాస్పదం అయ్యింది.తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా ఆయన లోకేష్ పైన, పార్టీ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు టిడిపి అధిష్టానానికి ఆగ్రహం కలిగించినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనపై చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోయారు.కానీ అంతర్గతంగా అటు చంద్రబాబుకు, లోకేష్ కు అచ్చెన్న వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం ఉంది.ఇక ఇప్పటికీ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్చార్జి లను నిర్మించుకో కపోవడం , అక్కడ పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు ఏ నాయకుడు ముందుకు రాకపోవడం , ఇలా అనేక అంశాలు ఇబ్బందికరంగా మారాయి.
జగన్ కనుక ముందస్తు ఎన్నికలకు వెళితే, టిడిపి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి సక్సెస్ అయ్యేంత సానుకూలత కనిపించడం లేదు.జగన్ ప్రభుత్వం పై క్రమక్రమంగా వ్యతిరేకత పెరిగినా, టిడిపి వైపు మాత్రం సానుకూలత జనాలు పెరగకపోవడం ఆ పార్టీకి ఇబ్బందికరమే.