సాధారణంగా పెళ్ళి తంతు అంటే అంతా ఇంత సందడి ఉండదు.శుభలేఖలు నుంచి బరాత్ వరకు ప్రతి శుభకార్యము చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.
కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో పెళ్లి వేడుకలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.ఇది వరకు లాగా ఎక్కువమందితో వివాహ వేడుకలు జరుపుకునేందుకు వీలు లేకుండా కేవలం 50 మందికి మాత్రమే హాజరయ్యేలాగా, అలాగే పెళ్లిళ్లకు వెళ్లిన సమయంలో మాస్క్, శానిటైజర్ అందుబాటులో ఉంచుకోవడం లాంటివి ఉన్నాయి.
ఈ కరోనా సమయంలో ఎవరైనా బంధువులు కూడా వివాహాలకు వెళ్లేందుకు బాగా ఆలోచనలో ఉన్నారు.అలాగే పెళ్ళి తంతు నిర్వహించే పురోహితులు కూడా వివాహ వేడుకల్లో పాల్గొన్న పెద్ద ఎత్తున ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా ఉండగా తాజాగా ఒక పురోహితుడు కరోనా భయంతో ఏకంగా కళ్యాణం వేదికపైకి అడుగు పెట్టకుండనే పూర్తి చేశాడు.పెళ్లి మండపం ముందు కార్ లోపల కూర్చొని మైకు సహాయంతో మంత్రాలు చదివి పెళ్ళి తంతు ముగించాడు.
ఈ సంఘటన ఎక్కడో కాదండి తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.పురోహితులు మాట్లాడుతూ కరోనా వైరస్ సమయంలో భౌతిక దూరం పాటించేందుకు ఇలా చేశానని తెలిపారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కోహెడకు చెందిన వధువు సౌమ్యకు, తంగళ్లపల్లికి చెందిన కృష్ణమూర్తి అనే వరుడుతో వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో పెళ్లి జరిపించే పురోహితుడు ప్రసాద్ రావు శర్మ మండపం వరకు వచ్చి కార్ లోనే ఉండి పెళ్లి మంత్రాలు చదివి వివాహ తంతును ముగించాడు పురోహితుడు ప్రసాద్ రావు తెలుపుతున్న విదంగా వరుడు ఆచరిస్తూ వధువు మెడలో తాళి కట్టేశాడు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి అందరికీ విధితమే.కేవలం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇది ఇలా ఉండగా లాక్ డౌన్ సమయంలో ఏదైనా పెళ్లి వేడుకలకు 50 మంది కంటే ఎక్కువ హాజరు కాకూడదని, అలాగే అంత్యక్రియలకు కేవలం 25 మంది కంటే ఎక్కువగా హాజరు అవ్వకూడదని నిబంధనలు విధించింది తెలంగాణ ప్రభుత్వం.