తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా నాయకులు ఉన్నారు.ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీజేపీ, కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకోవడం తో, పెద్దఎత్తున నాయకులు బలం ఆ పార్టీకి వచ్చి చేరింది.
అయితే ఆ విధంగా చేరినవారికి వివిధ నామినేటెడ్ పోస్టులతో పాటు, ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని హామీ సైతం ఇచ్చారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తమ వారసులకు టికెట్ ఇప్పించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ, కేసీఆర్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ,ఎంపీలు తమ స్థానంలో రాబోయే ఎన్నికల్లో తమ వారసులకు టికెట్ ఇవ్వాలని కోరుతుండగా, ఇంకొందరు మాత్రం తమతో పాటు, తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన ముందు పెడుతున్నారు.ప్రస్తుతం ప్రతి నియోజకవర్గం నుంచి ఈ తరహా ఒత్తిడి పెరిగిపోతుండడంతో కేసీఆర్ ఏ విధంగా వారికి హామీ ఇవ్వాలనే విషయంలో క్లారిటీ రావడం లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉండడంతో, ఇప్పటి నుంచే నాయకులు తమ వారసులను పొలిటికల్ ఎంట్రీ ఇప్పించేందుకు సిద్ధమైపోతున్నారు.నియోజకవర్గాల్లో వారిని వెంటపెట్టుకుని తిరగడం తో పాటు, వారి రాజకీయ బలం పెరిగే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం పార్టీలో ఎక్కడా ఎవరు అసంతృప్తి చెందకుండా కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహారాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో నేతలు తమ వారసుల విషయంలో కేసీఆర్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
ఎప్పుడో ఎన్నికలకు ఇప్పటి నుంచే హామీ పొందేందుకు ప్రయత్నిస్తున్న తీరు కేసీఆర్ కు ఆందోళన పెంచుతోంది.
ఇదిలా ఉంటే టిఆర్ఎస్ సీనియర్ నేత, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడు కి టికెట్ ఇప్పించుకునే విషయంలో కేసీఆర్ ను సంప్రదించడం తో పాటు, హామీ కూడా పొందినట్లు తెలుస్తోంది.అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా తన కుమారుని పొలిటికల్ ఎంట్రీ ఇప్పించేందుకు సిద్ధమవుతున్నారు.ఇదే విధంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముగ్గురు కుమారులలో కార్తీక్ రెడ్డి పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండగా , మరో ఇద్దరు కుమారులను సబితా పొలిటికల్ ఎంట్రీ ఇప్పించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక మంత్రి మల్లారెడ్డి తన కుమారుడు మహేందర్రెడ్డిని ఎన్నికల బరిలో దింపేందుకు కేసీఆర్ పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
అలాగే మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన కూతురుకి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్దు ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఆయన విషయంలో కెసిఆర్ అంటి ముట్టనట్టు గా వ్యవహరిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.అలాగే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన హోంమంత్రి మహమ్మద్ అలీ సైతం తన కుమారుడికి రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ ఇప్పించికునే ప్రయత్నాలు చేస్తుండటం, ఇలా ఎవరికి వారు తమ స్థాయిలో అధినేతపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్న తీరు ఇబ్బందికరంగా మారాయి.