భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ పాలకులు పాలించిన సంగతి తెలిసిందే.బ్రిటీష్ పాలకులు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చినా దేశంలోని వేల కోట్ల విలువైన సంపదను దోచుకెళ్లారని చరిత్రకారులు చెబుతున్నారు.
అయితే దేశంలో బ్రిటీష్ పాలన జరిగే సమయంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి.చరిత్ర ద్వారా కొన్ని ఉద్యమాలు వెలుగులోకి వస్తే వెలుగులోకి రాని ఉద్యమాలు సైతం ఎన్నో ఉన్నాయి. అలా బ్రిటీష్ పాలకుల హయాంలో జరిగిన ఉద్యమాల్లో చపాతీ ఉద్యమం కూడా ఒకటి.చపాతీ ఉద్యమం పేరు వినటానికి విచిత్రంగా ఉన్నా ఈ ఉద్యమం బ్రిటీష్ వారిని గజగజా వణికించింది.
1857వ సంవత్సరం సిపాయిల తిరుగుబాటు జరిగిందని మనందరికీ తెలిసిందే.అదే సంవత్సరం దేశంలో చపాతీ ఉద్యమం కూడా జరిగింది.ఈ ఉద్యమం ఏ గ్రామంలో మొదట ప్రారంభమైందో తెలీదు కానీ దేశమంతటా ఈ ఉద్యమం గురించి పెద్దఎత్తున చర్చ జరిగింది. మొదట ఉత్తర భారతదేశంలో ఈ చపాతీల ఉద్యమం మొదలైంది.
అడవిలో నుంచి కొందరు వ్యక్తులు వచ్చి గ్రామ కాపలాదారుడికి కొన్ని చపాతీలు ఇచ్చి గ్రామ ప్రజలకు పంచాలని సూచించేవారు.అలా ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి చపాతీల ఉద్యమం విస్తరించడం గమనార్హం.
ప్రజలతో పాటు పోలీస్ స్టేషన్లకు కూడా చపాతీలు చేరేవి. బ్రిటీశ్ అధికారి థోర్న్ హిల్ కు చపాతీల గురించి తెలిసి విచారణ జరిపించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చపాతీలను పంచుతున్నారని… అవి అక్కడి నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ వేరే ప్రాంతాలకు చేరుకుంటున్నాయని తేలింది.చపాతీల ద్వారా ఇతర ప్రాంతాలకు సందేశాలు వెళుతున్నాయనే అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి.
అయితే కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా ఈ ఉద్యమం ఆగిపోయింది.ఈ ఉద్యమానికి సంబంధించిన కారణాలు నేటికీ వెలుగులోకి రాలేదు.