ఇప్పుడు ఏపీలో’పల్నాడు’రాజకీయం హీటు పుట్టిస్తోంది.టీడీపీ వర్సెస్ వైసీపీ, టీడీపీ వర్సెస్ పోలీస్ అన్నట్టుగా యుద్ధ వాతావరణం నడుస్తోంది.
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడులు చేశారని చంద్రబాబు అంటే, వైసీపీ వారిమీదే టీడీపీ వారు అటాక్ చేశారంటూ అధికార పార్టీ ఎదురుదాడి చేస్తోంది.దీంతో పోటాపోటీగా చలో ఆత్మకూరు అంటూ రెండు పార్టీలు పిలుపు ఇచ్చాయి.
దీంతో పల్నాడు ప్రాంతం అసలు సిసలైన రణక్షేత్రంగా రాజకీయ పార్టీలు మార్చేశాయి.అయితే అసలు ఈ పల్నాడు వివాదం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది అందరికి ఆసక్తిగా మారింది.
ఎన్నికల సమయంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్లాటకు దిగారు.ఆ తరువాత కూడా ఇక్కడ అదే వాతావరణం కనిపిస్తోంది.
ప్రస్తుతం ఇరు పార్టీల నాయకులు ఆందోళనలకు పిలుపునివ్వడం, ఇరు పార్టీలు కార్యకర్తలు భారీగా చేరుకుంటుండటం, పోలీసుల మోహరింపులతో, మొత్తం పల్నాడు ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది.అసలు ఈ ఛలో ఆత్మకూరు పిలుపు వెనుక పెద్ద రాజకీయమే ఉన్నట్టు తెలుస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక గురజాల, సత్తెనపల్లితో పాటు గుంటూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని, చంద్రబాబు ఆరోపిస్తున్నారు.ఇళ్లపై దాడులు చేసి, ఊళ్ల నుంచి తరిమేశారని అంటున్నారు.దాదాపు 500 కుటుంబాలు వేరే ఊళ్లల్లో దాచుకోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.పల్నాడులో హక్కుల ఉల్లంఘన సాగుతోందని ఆరోపించారు చంద్రబాబు.వైసీపీ కూడా, టీడీపీ ఆరోపణలపై గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.
టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులతో బాధితుల పునరావాస శిబిరం అంటూ మాలాడుతున్నారని, హోంమంత్రి సుచరిత విమర్శలు చేశారు.నిజంగా బాధితులో కాదు, నిజనిర్ధారణ బృందం పంపి తేలుస్తామని ఆమె అన్నారు.తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వైరాలు, గ్రామస్థాయిల్లో పరస్పర దాడులకు దారి తీయడం కొత్త విషయం ఏమీ కాదు.
రాయలసీమలో రాజకీయ హత్యలు అన్నీఇన్నీ కావు.అయితే పల్నాటి గొడవలను హైలెట్ చేయడం వెనక చంద్రబాబు వ్యూహం వేరే ఉన్నట్టు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఏపీలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుండడం, ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకుల్లో నిస్తేజం అలుముకున్నాయి.సరిగ్గా ఇదే అదునుగా భావిస్తున్న బీజేపీ ఏపీలో టీడీపీ స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోంది.
అంతే కాదు టీడీపీ హయాంలోని అవినీతిపై వైసీపీ విచారణ కమిటీలు వేసుకుంటూ వెళ్తోంది.ముఖ్యంగా గుంటూరులో టీడీపీ నాయకులు కోడెల కే ట్యాక్స్, అసెంబ్లీ ఫర్నీచర్, యరపతినేని మైనింగ్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులపై రకరకాల కేసులు నమోదవుతున్నాయి.ఇటువంటి సమయంలో అధినేత చంద్రబాబు వయస్సు మీద పడడంతో పాటు ఆయన తరువాత పార్టీని నడిపించే నాయకుడు ఎవరు అనే ప్రశ్నపార్టీ నాయకులను వేధిస్తోంది.
ఇది గమనించిన బాబు టీడీపీలో తిరిగి జోష్ నింపడానికి,పల్నాడు వివాదాన్ని అస్త్రంగా చేసుకుని రాజకీయ చాణక్యం ప్రదర్శించే ప్రయత్నం చేరుస్తున్నట్టు కనిపిస్తోంది.బాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అలజడితో నిజా నిజాలు ఎలా ఉన్నా టీడీపీలో కొత్త ఉత్సాహం రేకెత్తించడంలో మాత్రం బాబు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.