విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే తాజాగా అమానుషంగా ప్రవర్తించి అందరి ఆగ్రహానికి గురవుతున్నాడు.కొట్టుకోవద్దని పిల్లలకు చెప్పాల్సిన ఆ ఉపాధ్యాయుడే ఇప్పుడు వ్యక్తిత్వంగా దిగజారి ప్రవర్తించాడు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో సదరు ఉపాధ్యాయుడు… నిజానికి ఉపాధ్యాయులకే పెద్ద అయిన ప్రిన్సిపాల్ అయ్యుండి వీధి రౌడీలా రెచ్చిపోయాడు.
తాను పనిచేస్తున్న పాఠశాలలోనే డ్యూటీ చేస్తున్న ఒక మహిళా టీచర్ ని షూతో ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు.ఇంతకీ ఆ మహిళా టీచర్ చేసిన తప్పేంటి అంటే కాస్త ఆలస్యంగా రావడం! ఆలస్యంగా వస్తే మాటలతో హెచ్చరించాలి కానీ ఇలా పోట్లాడుకోవడం ఏమాత్రం సమంజసం కాదు.
వివరాల్లోకి వెళితే.ఉత్తరప్రదేశ్, లఖింపూర్, ఖేరీలోని మహేంగు ఖేరా అనే గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది.ఈ పాఠశాలలో అజిత్ వర్మ ప్రిన్సిపాల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.అయితే జూన్ 24న స్కూల్కి ఒక మహిళ టీచర్ లేటుగా వచ్చింది.
ఇది గమనించిన ప్రిన్సిపాల్ ఆమెపై అరవడం స్టార్ట్ చేశాడు.ఆలస్యంగా ఎందుకు వచ్చావని అతను అరుస్తుంటే మిగతా టీచర్లందరూ ప్రిన్సిపాల్ రూమ్ కి చేరుకున్నారు.
పిల్లలు కూడా ఏం జరుగుతుందనే కంగారుతో అక్కడికి వచ్చారు.ఈ నేపథ్యంలోనే ప్రిన్సిపాల్ మంచీచెడూ చూడకుండా అందరి ముందే ఒక పశువులా ప్రవర్తించాడు.
టీచర్ ను బూతులు తిడుతూ ఆమెను బూటు తీసుకుని విచక్షణారహితంగా కొట్టాడు.ఈ క్రమంలో ఆ మహిళా టీచర్ కూడా ప్రతి దాడికి దిగింది.
ఈ కొట్లాట మరింత పెద్దదిగా కాకుండా వెంటనే తోటి ఉపాధ్యాయులు ఇద్దరిని శాంతింప చేయడానికి ప్రయత్నించారు.
ఈ దృశ్యాలను ఒకరు వీడియో తీయగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.మహిళా టీచర్ ప్రిన్సిపల్ పై కంప్లైంట్ కూడా ఇచ్చింది.దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
ఉన్నత విద్యాశాఖ అధికారులు అతన్ని కొన్ని నెలల పాటు సస్పెండ్ కూడా చేశారు.స్కూల్ ప్రిన్సిపాల్ అజిత్ వర్మను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీకాంత్ పాండే పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఉపాధ్యాయురాలిదే తప్పు అని.తన తప్పు ఏం లేదని ప్రిన్సిపాల్ వాదిస్తున్నాడు.సదరు ఉపాధ్యాయురాలు కావాలనే ప్రతిరోజూ లేటుగా వస్తూ తన ఇష్టం అన్నట్టుగా ప్రవర్తిస్తోందని అతను ఆరోపించాడు.అంతేకాదు, ఉపాధ్యాయురాలే తనపై మొదటగా మ్యాన్ హ్యాండిల్ చేసిందని ఆరోపణలు చేశాడు.
కాగా దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.