మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి అందరికీ విదితమే.కాగా, ఈ బై పోల్ను అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.
‘దళిత బంధు’ పథకానికి ముహుర్తం కూడా ఖరారు చేయగా, ఈ క్రమంలోనే గులాబీ నేతలు హుజురాబాద్ ప్రజలను టీఆర్ఎస్ వైపునకు మలుచుకునే ప్రయత్నం చేశారు.తాజాగా ప్రమాణాలకు తెరలేపారు గులాబీ నేతలు.
హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలోని ప్రజలతో ప్రత్యేకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమావేశమయ్యారు.ఈ క్రమంలోనే కమలాపూర్ ప్రజలతో తాము టీఆర్ఎస్కే ఓటు వేస్తామని ప్రమాణం చేయించారు.మండలంలోని గూడూరు గ్రామ ప్రజలతో ఈ మేరకు ప్రమాణం చేయించాడనికి గల కారణం కూడా తెలిపారు.ఎల్లమ్మ గుడికి రూ.10 లక్షలు ఇస్తున్నందున గౌడ సామాజిక వర్గ ప్రజలు కారు గుర్తుకే ఓటేయాలని చెప్పారు.మొత్తంగా సామాజిక వర్గాల సమీకరణాలకూ టీఆర్ఎస్ పార్టీ తెరలేపుతోంది.
ఇప్పటికే ‘దళిత బంధు’ పేరిట దళితుల ఓట్లను తమ వైపునకు తిప్పుకున్న గులాబీ దళం, గొర్రెల పంపిణీ, సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు వంటి తదితర చర్యలతో అన్ని వర్గాలను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది.బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా ఆయన ప్రజెంట్ హెల్త్ కండిషన్స్ రిత్యా పాదయాత్రకు ఇక శాశ్వతంగా బ్రేక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుండగా, ఈ సమయంలోనే ప్రజలను తమ వైపునకు పూర్తిగా తిప్పుకోవాలని గులాబీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.
అందులో భాగంగానే ప్రమాణాలు, హామీలు, పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఉంటున్నట్లుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.నియోజకవర్గ ప్రజలతో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడేందుకు కూడా వెనుకాడటం లేదు.
గులాబీ నేతల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేసి చూడాల్సిందే.