మాజీ మంత్రి మాజీ టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ ను దెబ్బతీసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇప్పటికే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను మోహరించి గడపగడపకు హుజురాబాద్ అనే నినాదంతో ఓటర్లను కలిసే విధంగా ప్లాన్ చేశారు.
అంతేకాకుండా పెద్దఎత్తున అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.అసలు ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థికి కాకుండా మరెవరికీ ఓట్లు పడకుండా కేసీఆర్ చాలా జాగ్రత్తలు చాలా పకడ్బందీ గా తీసుకున్నారు.
ఈటెల రాజేందర్ కనుక ఈ నియోజకవర్గంలో గెలిస్తే తమ పరువు మొత్తం పోతుందని , రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కష్టమవుతుందనేది కెసిఆర్ కు బాగా తెలుసు. అసలు ఇప్పట్లో హుజురాబాద్ ఎన్నికలు లేకపోయినా, కెసిఆర్ మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లుగానే హడావుడి పడుతున్నారు.
ఈటల రాజేందర్ బలం తగ్గించడం ద్వారానే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చనే ఉద్దేశంతో ప్రధాన అనుచరుల పైన కేసీఆర్ గురి పెట్టారు.వారందరినీ టీఆర్ఎస్ వైపు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అయినట్టు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రధాన సామాజిక వర్గాలపై కేసీఆర్ దృష్టిసారించారు.మత్స్య పారిశ్రామిక సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన ఈటెల ప్రధాన అనుచరుడు లక్ష్మణ్ తో పాటు భారీ ఎత్తున కార్యకర్తలను టిఆర్ఎస్ చేర్చుకున్నారు.
అలాగే జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ పింగళి రమేష్ కూడా భారీ ఎత్తున తన మద్దతుదారులతో టిఆర్ఎస్ లో చేరారు.
అలాగే వీణవంక మండలం ఎంపీటీసీ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు రావి శెట్టి లలిత శ్రీనివాస్ సైతం టీఆర్ఎస్ లో చేరిపోయారు.వీరంతా ఈటెల రాజేందర్ సామాజిక వర్గమైన ముదిరాజ్ కులానికి చెందినవారు కావడంతో, ఆ వర్గం ఓట్ల లో చిలక తేవడంలో టిఆర్ఎస్ సక్సెస్ అయింది.ఇలా ఒక్కో ప్రధాన అనుచరుడిని రాజేందర్ కు దూరం చేయడం ద్వారా, టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు సునాయాసం అవుతుందని, అదీ కాకుండా ఎన్నికలు ఆలస్యం అయ్యే కొద్ది రాజేందర్ ప్రభావం, ఆయన పై ఉన్న సానుభూతి క్రమక్రమంగా తగ్గిపోతుందనే అభిప్రాయంతోనే కెసిఆర్ ఈ తరహా ఎత్తుగడలకు దిగినట్టుగా కనిపిస్తున్నారు.