తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం పంచాయతీ పరిధిలోని గుండ్లమడుగు గ్రామస్తులు వారానికి మూడు, నాలుగు రోజుల్లో గడ్డిని ఆహారంగా భుజిస్తారు.ఇక్కడ నివసిస్తున్న 30 కుటుంబాలు తాము వండుకునే అన్నంలోకి గడ్డిని కూరగా వేసుకుని విందు భోజనం ఆరగించినట్టు చాలా ఇష్టం గా తింటారు.
పచ్చి గడ్డి తో కూర చేయడంతో పాటు పప్పులో కూడా వేసుకొని వండుకుంటారు.
గోంగూర, పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరలను పచ్చడి చేసినట్టు గడ్డి తో వీళ్లు కూడా పచ్చడి చేసుకుంటారు.
ఎండిన గడ్డి ని మెత్తగా దంచి నీటిలో కలుపుకుని ఆ మిశ్రమాన్ని తాగుతారు.ఈ గడ్డి తమకు చాలా శక్తినిస్తుందని పచ్చ గడ్డి లో చాలా పోషకాలు ఉంటాయని ఈ గ్రామ ప్రజలు చెబుతున్నారు.
అయితే ఈ గ్రామ ప్రజల ఆహార అలవాట్లపై మణుగూరు మండల వైద్యాధికారి మౌనిక స్పందించారు.ఆమె మాట్లాడుతూ గోదావరి తీరాన పారే వాగుల ఒడ్డున ఎక్కువగా ఇటువంటి గ్రాసం మోలుస్తుందని మిగతా ఆకుకూరల లాగానే ఈ గ్రాసంలో కూడా చాలా పోషక విలువలు ఉంటాయని స్పష్టం చేశారు.
గిరిజన ప్రాంతాల్లో ఈ గడ్డిని ఈనకూర అని పిలుస్తుంటారని తెలియజేశారు.
ఐతే ఈ గ్రాసం లిలియేసి జాతికి చెందినదని ఈ గ్రాసం లో పుష్కలంగా B12 విటమిన్ తో పాటు ఖనిజ లవణాలు ఎక్కువగా లభిస్తాయని జిల్లా ఉద్యాన అధికారి చెప్పుకొచ్చారు.
ఈ గ్రాసం తినడం వలన మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నీటి నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ గ్రాసం దట్టంగా పెరుగుతుందని ఆయన తెలిపారు.
ఇకపోతే ఈ గిరిజనుల ఆహారపు అలవాట్ల గురించి అనేక కథనాలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే గిరిజనులు పిలిచినట్టు ఈ గ్రాసాన్ని అందరూ కూడా ఈనకూర అని పిలిస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు.గడ్డి తింటున్న గిరిజనులు అని అసభ్యంగా చెప్పుకోవడం కంటే వారి తిండి అలవాట్లను గౌరవిస్తూ ఈనకూర తింటున్న గిరిజనులు అని వర్ణించడం ఉత్తమమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.