గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన పదేపదే పోస్తోంది.చిరంజీవికి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టి, అవసరమైతే కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించేందుకు వైసీపీ ప్లాన్ చేసిందని, దీని ద్వారా అటు జనసేనకు చెక్ పెట్టడంతో పాటు, కాపు సామాజిక వర్గంకు దగ్గర అవ్వవచ్చు అనేది వైసిపి ప్లాన్ గా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
అలాగే చిరంజీవి 2024 ఎన్నికల సమయానికి జనసేన లో యాక్టివ్ అవుతారని, బిజెపి ,జనసేన కూటమి అధికారంలోకి వస్తే చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారు అనే మరో ప్రచారం కూడా జరుగుతోంది.అయితే ఈ వ్యవహారాలపై చిరంజీవి తన స్పందన తెలియ చేయడం లేదు.
సేవా కార్యక్రమాలతో ఆయన జనాల్లో మరింతగా తన పలుకుబడిని పెంచుకుంటూ వెళ్తున్నారు.
ఇదిలా ఉంటే చిరంజీవి కాంగ్రెస్ లో లేరు అంటూ కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి ఉమెన్ చాందీ సంచలన ప్రకటన చేయడంతో, ఒక్కసారిగా కలకలం రేగింది.
ముఖ్యంగా కాంగ్రెస్ నేతలే ఈ వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డారు.చిరంజీవి కాంగ్రెస్ వారేనంటూ ఏఐసిసి తో పాటు, ఏపీ కాంగ్రెస్ తరపున స్పష్టమైన ప్రకటన చేశారు.చిరంజీవి కాంగ్రెస్ వాది కాదు అంటూ ఉమెన్ చాందీ అనడంపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఒక ప్రకటన చేశారు.మాజీ కేంద్ర మంత్రి సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ వాదేనని, తనకిష్టమైన సినీ రంగంలో బిజీగా ఉండడం వల్లే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు.
అలాగే కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రజలతో మమేకం అవుతున్నారని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యారని, చిరంజీవితో పాటు ఆయన కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ వాదులేనంటూ శైలజానాథ్ క్లారిటీ ఇచ్చారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ తరఫున చిరంజీవి కీలకంగా వ్యవహరిస్తారని ఆయన చెబుతున్నారు.చిరంజీవి కాంగ్రెస్ లో చాలాకాలం నుంచి యాక్టివ్ గా ఉండకపోవడంతోనే ఉమెన్ చాందీ ఈ తరహా వ్యాఖ్యలు చేసినా, ఆయన వైసీపీలో చేరతారేమో అనే భయం కాంగ్రెస్ పెద్దలతో పాటు, ఏపీ కాంగ్రెస్ నేతల్లోనూ ఉండడంతోనే ఈ విధమైన ప్రకటన వెలువడినట్లు కనిపిస్తోంది.