చెప్పుకోవడానికి అందరూ ఉన్నా, ఒంటరి యుద్ధం చేయాల్సిన పరిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చింది.రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారు.
తన వయసును కూడా లెక్కచేయకుండా పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అవసరమైన ఎత్తుగడలు వేస్తూ, వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తన కుమారుడిని , తనను వైసీపీ నాయకులు అవమానిస్తూనే ఉన్నా, సొంత మనుషుల రెస్పాన్స్ అంతంత మాత్రం గానే ఉంది.
అయితే ఇటీవల తన భార్య భువనేశ్వరి పై వైసీపీ నాయకులు చేసిన విమర్శలు బాబుకు కన్నీళ్లు తెప్పించాయి.నందమూరి కుటుంబం అంతా ఏకమై మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు కుటుంబానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
అయితే చంద్రబాబు వియ్యంకుడు .హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం తన అక్క భువనేశ్వరి కి జరిగిన అవమానం పై మిగతా కుటుంబ సభ్యులతో పాటే స్పందించి తర్వాత సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా హిట్ కావడంతో ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ అభిమానుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సందర్భంగా చంద్రబాబు కు అన్ని రకాలుగా అండదండలు అందించేందుకు సొంత మనుషులు అవసరం చాలా ఉంది.
లోకేష్ ఈ లోటు తీరుస్తాడు అనుకున్నా, ఆయన ప్రభావం అంతంత మాత్రంగానే ఉండటంతో అందరూ బాలయ్య అంశాన్ని ప్రస్తావిస్తున్నారు .
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాలయ్య కి అభిమానులు ఉన్నారు.బాలయ్య టీడీపీ తరఫున కనుక గట్టిగా ప్రచారం చేసి అభిమానులకు పిలుపు ఇస్తే పార్టీకి మరింత మేలు జరుగుతుంది. కానీ బాలయ్య మాత్రం రాజకీయాల్లో ఉన్నా, సైలెంట్ గానే ఉంటున్నారు.
ఎక్కువగా రాజకీయాలను పట్టించుకునే తీరిక ఆయనకు లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. బాలయ్య వంటి చరిష్మా ఉన్న వ్యక్తులు టీడీపీ బలోపేతానికి మరింత కృషి చేస్తే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి విజయం దక్కడం అంత కష్టమేమీ కాదు అనే అభిప్రాయాలు ఉన్నాయి.
కానీ బాలయ్య మాత్రం ఈ విషయంలో అంత సానుకూలంగా ఉన్నట్టు అయితే కనిపించడం లేదు.తాను ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గం లోనే అప్పుడప్పుడు పర్యటిస్తూ, సినిమాల వైపు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.ప్రస్తుతం టీడీపీ కష్టకాలంలో ఉండడంతో బాలయ్య రంగంలోకి దిగాలని టీడీపీ అభిమానులు కోరుతున్నారు.