దశాబ్దాలుగా తెలుగు దేశం పార్టీని అంటిపెట్టుకుని ఉండడమే కాకుండా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు గా ఉన్న ఎల్ రమణ ను టిఆర్ఎస్ లోకి తీసుకు వచ్చే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు కేసీఆర్.ఇటీవలే ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో ఆయన బిజెపిలో చేరబోతున్నారు.
దీంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన రమణ ను కేసీఆర్ తెరపైకి తెచ్చారు.ఇద్దరు కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడంతో ఈటెల లోటును రమణ ద్వారా భర్తీ చేయాలనేది కేసీఆర్ ప్లాన్.
రమణ ను టిఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ పదవి తో పాటు , అవసరమైతే మంత్రి పదవి ఇచ్చే అవకాశాన్ని కూడా టిఆర్ఎస్ పరిశీలిస్తోంది. ఈ విషయంపై మరో రెండు రోజుల్లో క్లారిటీ రాబోతుంది.
అయితే రమణ టిఆర్ఎస్ లో చేరబోతుండడాన్ని , ఆయనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆ పార్టీ నాయకులే తప్పుపడుతున్నారు.రమణ కేసీఆర్ ఊహించనంత రాజకీయ ఉద్దండుడు ఏమీ కాదని, ఆయనను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని , ఆయన టిడిపి అధ్యక్షుడిగా ఉన్న ఆ పార్టీ బలోపేతానికి ఏమాత్రం కృషి చేయలేదని, అప్పుడప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ కు వెళ్లి రావడం తప్పించి మిగతా సమయంలో పార్టీ కోసం ఆయన కృషి చేసింది ఏమీ లేదనే విషయాన్ని టిఆర్ఎస్ నేతలు తెరపైకి తెస్తున్నారు. అలాగే ఇటీవల ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేసినా, డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు.
అది ఆయన బలం అంటూ టిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, పెద్దగా బలం లేని రమణ ను ఎమ్మెల్సీ, మంత్రిపదవి ఆఫర్ చేసి మరి తీసుకురావడం అవసరమా అనే చర్చ ఇప్పుడు టిఆర్ఎస్ లోనే నెలకొంది.రమణ వల్ల టిఆర్ఎస్ కు కలిగే అదనపు ప్రయోజనం ఏమిటనే విషయం పైన ఆ పార్టీ నాయకులో చర్చ జరుగుతోంది.
ఇక మెజారిటీ మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారట.కేవలం జిల్లా, సామాజిక వర్గం ప్రాతిపదికన రమణను తీసుకొస్తున్నా, ఈటెల స్థాయి వ్యక్తి ఆయన కానే కాదు అనే విషయాన్ని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.