కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు.
సీనియర్లు వర్సెస్ సీనియర్లు, సీనియర్లు వర్సెస్ జూనియర్లు అన్నట్లుగా ఒకరిపై ఒకరు సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసుకుంటూ, పార్టీని మరింత గా డామేజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ తెలంగాణ కాంగ్రెస్ లో షరా మామూలు వ్యవహారాలే.
ముఖ్యంగా రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ సీనియర్లు అంతా ఏకతాటిపై ఉంటూ ఆయన నాయకత్వాన్ని ఒప్పుకునే లేదు అంటూ కాంగ్రెస్ అధిష్టానం దగ్గర భీష్మించుకుని కూర్చున్నా, అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గా నియమించింది. ఇక అప్పటి నుంచి రేవంత్ వ్యవహారం లో సీనియర్లంతా ఒక తాటిపై ఉంటూ తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే వస్తున్నారు.
ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉంటారు.అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరి ధర్నా ఈ రోజు నిర్వహించారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద రెండు రోజుల దీక్షకు దిగారు.రేవంత్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎంపీ వి.హనుమంతరావు దీక్షలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు.అలాగే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం ఈ దీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో ఆయన ముచ్చటిస్తూ, నవ్వులు చిందించారు.
ఇవన్నీ కాంగ్రెస్ తెలంగాణ శ్రేణులో ఆశ్చర్యాన్ని కలిగించాయి.అలాగే ఈ దీక్షలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు .అయితే చాలా కాలం తర్వాత సీనియర్ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి దీక్ష శిబిరంలో కనిపించడం కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. ముందు ముందు ఇదే ‘ సీన్ ‘ కనిపించేలా చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమి కాదనే అభిప్రాయాలు కాంగ్రెస్ శ్రేణుల నుంచే వ్యక్తమవుతున్నాయి.