కరోనా తరువాత పలు దేశాలు వివిధ రంగాలలో తీవ్రమైన గడ్డుకాలాన్ని చవిచూశాయి.మరెన్నో దేశాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.
మరీ ముఖ్యంగా పర్యాటక రంగంపైనే పూర్తిగా ఆధారపడిన హాంకాంగ్ పరిస్థితి అయితే చాలా అద్వాన్నంగా తయారైంది.దీంతో ఆ దేశం ఓ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఇప్పటికే కుదేలయిన పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు విదేశీ పర్యాటకులను ఆకర్శించే విధంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది.అవును, ఈ మేరకు దాదాపు 5లక్షల ఫ్లైట్ టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
పర్యాటక ప్రచార కార్యక్రమం ‘హలో హాంకాంగ్’ ప్రారంభించిన నేపథ్యంలో 5 లక్షల ఫ్లైట్ టికెట్లు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.ఈమేరకు హాంకాంగ్ విమానయాన సంస్థలు ఈ గురువారం ఓ ప్రకటన విడుదల చేసి పర్యాటకులకు శుభవార్తను తెలియజేశాయి.ఈ పథకంలో భాగంగా తమ దేశాన్ని సందర్శించాలనుకున్న పర్యాటకులకు వన్ ప్లస్ వన్ పద్ధతిలో టికెట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అలాగే లక్కీ డ్రా విధానంలో కూడా ఈ ఉచిత టికెట్లను గెలుచుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
మార్చి నుంచి సెప్టెంబర్ వరకు విడతల వారీగా ఈ ఉచిత టికెట్ల పంపిణీ జరుగుతుందని ఈ సందర్భంగా చెబుతున్నారు.టికెట్లతో పాటు పలు కూపన్లు, క్యాష్ వోచర్లను గెలుచుకునే అవకాశంకూడా కల్పిస్తున్నారు.కాగా ఉచిత విమాన టికెట్ల కోసం హాంకాంగ్ ఎయిర్ లైన్స్ సంస్థలు ఏకంగా 2 బిలియన్ హాంకాంగ్ డాలర్లు (మన కరెన్సీలో రూ.2,100 కోట్లు) ఖర్చు చేస్తున్నట్టు భోగట్టా.భారతీయులకు కూడా ఉచిత టికెట్ల ఆఫర్ వర్తిస్తుందని, మార్చిలో ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా పౌరులకు టికెట్లు కేటాయిస్తామని హాంకాంగ్ విమానయాన సంస్థల ప్రతినిధి వెల్లడించారు.