ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయం ఏమిటో అప్పుడే చూపించేస్తున్నారు.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలోనే దూకుడుగా వ్యవహరించే వారు.
పిసిసి అధ్యక్ష బాధ్యతలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తన ప్రతాపం చూపిస్తున్నారు.ఇక కాంగ్రెస్ పని తెలంగాణలో అయిపోయింది అనుకుంటున్న సమయంలో, పార్టీకి ఊపిరి పోసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రావడం అసంభవం అనే అభిప్రాయంతో చాలామంది నేతలు పార్టీని విడిచి ఇతర పార్టీల్లో చేరిపోయారు.అయితే రేవంత్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో మునుపటి ఉత్సాహం కనిపిస్తోంది.
ఇతర పార్టీల్లోకి వెళ్లి, పెద్దగా ప్రాధాన్యం పొందలేని నేతలు ఇప్పుడు రేవంత్ నాయకత్వంలో పనిచేసేందుకు, కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.ఈ మేరకు రేవంత్ సైతం ఈ తరహా ఆలోచనలో ఉన్న నేతలందరినీ స్వయంగా కలుస్తూ, పార్టీ లోకి రావాల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారు.
ఈ ప్లాన్ వర్కవుట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.అలాగే కాంగ్రెస్ సీనియర్లు చాలామంది తన నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని గ్రహించిన రేవంత్ వారిని కలిసి మీ సలహాలు సూచనలతోనే ముందుకు వెళ్తాను అని చెబుతూ వారి మద్దతును పొందుతున్నారు.
పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత పెద్దఎత్తున నేతలే కాంగ్రెస్ లో చేరారు.
మరెందరో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.గతంలో టిడిపి కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్న నేతలు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.వీరే కాకుండా టిఆర్ఎస్ లోనే ఉంటూ, అసంతృప్తి ఉన్న నేతలు రేవంత్ వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా హుజురాబాద్ ఎన్నికలు ముందు తరువాత కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా రేవంత్ ప్లాన్ చేసుకుంటున్నారు .
రేవంత్ పై నమ్మకం పెరగడంతోనే పార్టీలోకి చేరికలు తప్ప పెద్దగా పార్టీని విడిచి వెళ్లే నేతలు కనిపించకపోవడం ఆయన సామర్థ్యానికి గుర్తింపుగా కనిపిస్తోంది.ఇక కాంగ్రెస్ అధిష్టానం సైతం అన్ని విషయాలలోనూ రేవంత్ కు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడంతో మరింత చొరవగా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్ ను బలోపేతం చేసే విషయంలో సక్సెస్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు.