తెలంగాణ అధికార పార్టీగా వైఎస్ఆర్ టీపీ ని తీర్చిదిద్దాలని, తెలంగాణ ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించాలనే ఏకైక లక్ష్యంతో వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపించారు.గతంలో తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను పదే పదే గుర్తు చేస్తూ, రాజన్న రాజ్యం తెలంగాణలో తీసుకొస్తాను అనే నినాదంతో షర్మిల తన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు.
పార్టీ ఆవిర్భావ సమయంలో పెద్ద ఎత్తున నాయకులు ఆమె పార్టీలో చేరారు.తెలంగాణలోని మిగతా పార్టీలో రాజకీయ ప్రాధాన్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు అంతా షర్మిల పార్టీలో చేరిపోయారు.
వరుసగా నాయకులు పార్టీలో చేరుతుండడంతో షర్మిల లోను కొత్త ఉత్సాహం కనిపించింది.ఆ ఉత్సాహంతోనే అధికార పార్టీ టిఆర్ఎస్ పై పదే పదే విమర్శలు చేస్తూ తెలంగాణలో బలపడేందుకు , సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు.
ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతూ, టిఆర్ఎస్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు.అయితే మొదట్లో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో కనిపించడం లేదు.
అలాగే షర్మిల కు మీడియా ఫోకస్ బాగా తగ్గడం, పెద్దగా ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే అభిప్రాయం అందరిలోనూ కలగడం, తదితర కారణాలతో ఇప్పుడు పార్టీలో చేరే వారి కంటే , పార్టీని వీడి బయటకు వెళ్ళిపోయే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.ఇప్పటికే ఎంతోమంది కీలక నాయకులు పార్టీని వీడి బయటకు వెళ్లిపోయారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఇందిరా శోభన్ పార్టీలో చేరారు.ఆమె రాకతో వైఎస్ఆర్ టిపిలో కొత్త ఉత్సాహం వస్తుందని , మరింతగా తెలంగాణ ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుందని అంత భావించారు.
ఇక ఆ పార్టీలో ఆమెకు అధికార ప్రతినిధి గా షర్మిల అవకాశం ఇచ్చారు.ఆ తరువాత ఆమెను షర్మిల పెద్దగా పట్టించుకోవడం లేదని, తనకు కీలకమైన స్థానం ఇవ్వకుండా అధికార ప్రతినిధి తో సరిపెట్టారు అనే అసంతృప్తితో పాటు, షర్మిల పార్టీకి పెద్దగా రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో ఇందిరా శోభన్ వైఎస్సార్ టిపికి రాజీనామా చేసి వెళ్లిపోయారు.ఇక ఆ తరువాత చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ గా కొనసాగిన ప్రతాపరెడ్డి తనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేయగా, నిన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ కన్వీనర్ మహమ్మద్ ఇబ్రహీం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు.అయితే పార్టీని వీడి బయటకు వెళ్లే ఆలోచనలో ఉన్న నేతలందరినీ బుజ్జగించేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నా, అవి ఏ మాత్రం సక్సెస్ కావడం లేదు.
పార్టీలో ఆశించినంత స్థాయిలో చేరికలు లేకపోగా, పార్టీలో ఉన్న నేతలనే కాపాడుకోలేని పరిస్థితి షర్మిలకు ఏర్పడింది.