పొట్ట చేతపట్టుకుని విదేశాలకు వెళ్లిన ఎంతో మంది ప్రవాస భారతీయులకు కరోనా వైరస్ ఒక పాఠాన్ని నేర్పించింది.బంధు మిత్రులను, అయినవాళ్లను వదులుకొని మనం సాధించేది ఏంటన్న భావన ప్రతి ఒక్కరిలో కలిగింది.
కొంతమంది ఉద్యోగాలు కోల్పోగా, ఇంకొందరు ఉన్నత హోదాలను సైతం వదిలేసి భారతదేశానికి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు.అయితే ఈ పరిస్థితిని రెండేళ్ల నాడే ఊహించిన ఓ ఎన్ఆర్ఐ న్యూజిలాండ్లో మంచి ఉద్యోగాన్ని వదిలపెట్టి స్వదేశంలో టీ వ్యాపారం మొదలుపెట్టారు. జగదీశ్ కుమార్ అనే ఎన్ఆర్ఐ న్యూజిలాండ్లో హాస్పిటాలిటీ వ్యాపారాన్ని నడుపుతున్నాడు.అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఆయన దానిని వదిలిపెట్టి భారత్కు తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.దీనితో పాటు ప్రధాని నరేంద్రమోడీ మేక్ ఇన్ ఇండియా పిలుపు జగదీశ్ను ఆలోచింపజేసింది.ఇకపై తన శక్తి సామర్ధ్యాలు, పెట్టుబడులు భారతదేశంలోనే పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
దీనిలో భాగంగా 2018లో భారత్కు వచ్చేశాడు జగదీశ్.
స్వదేశం వచ్చిన తర్వాత మనదేశంలో లభించే వివిధ రకాల టీల గురించి అధ్యయనం చేశాడు.
ఇందుకోసం నాగ్పూర్ నుంచి అస్సాం వరకు వున్న తేయాకు తోటల్లో తిరిగాడు.దీనిపై స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత 2019లో నాగపూర్ కేంద్రంగా ‘‘ కార్బైట్ యూనిట్ ఆఫ్ ఎంజిజె రెస్టారెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ’’ పేరుతో టీ వ్యాపారాన్ని ప్రారంభించాడు.
ఇందులో రకరకాల టీలను విక్రయించడం మొదలుపెట్టాడు.దేశంలోని ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, హెచ్సీఎల్లకు సైతం టీ సరఫరా చేశాడు.దీనికి మంచి ఆదరణ లభించడంతో కేవలం ఏడాది కాలంలోనే కంపెనీ టర్నోవర్ 1.2 కోట్ల రూపాయలకు చేరుకోవడంతో పాటు 35 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.
దేశంలోని కొన్ని ఔట్లెట్స్ కప్పు టీని 90 రూపాయలకు విక్రయిస్తున్నాయి.ప్రతి నెలా 25 వేల నుంచి 30 వేల రూపాయలు సంపాదించే ప్రజలు రోజూ టీ కోసం 90 రూపాయలు ఖర్చు చేయలేరని జగదీశ్ అభిప్రాయపడ్డాడు.
అందువల్ల సరసమైన ధరల్లోనే వివిధ రకాల టీలను అందిస్తున్నాట్లు అతను తెలిపాడు.అతని వద్ద ‘‘ మార్డో వాలీ చాయ్, ప్యార్ మొహబ్బత్ వాలీ చాయ్, మమ్మీ కే హాత్ వాలీ చాయ్, డోస్టన్ వాలీ చాయ్, యాంటీ కరోనా బ్రహ్మాస్తా చాయ్’’ వంటివి దొరుకుతాయి.