ఈమద్య కాలంలో ప్రతి సినిమా కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది.కొన్ని సినిమాలకు అది ప్లస్ అవుతుండగా మరి కొన్ని సినిమాలకు మాత్రం మైనస్ అవుతుంది.
ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘దేవదాస్’ చిత్రం కథ కాపీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.గత కొన్ని రోజులుగా ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.
ఇలాంటి సమయంలోనే అఖిల్ అక్కినేని మూడవ సినిమా కూడా బాలీవుడ్ చిత్రానికి కాపీ అంటూ వార్తలు వస్తున్నాయి.
అక్కినేని అఖిల్ మూడవ సినిమా ‘మిస్టర్ మజ్ను’.వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.తాజాగా ఈ చిత్రం బాలీవుడ్లో తెరకెక్కిన ఒక చిత్రంకు కాపీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు రంగంలోకి దిగి ఆ వార్తలను కొట్టి పారేసే ప్రయత్నం చేస్తున్నారు.
మిస్టర్ మజ్ను చిత్రం సొంత కథతోనే దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
అఖిల్ మొదటి రెండు సినిమాలు బాక్సాపీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ విషయం తెల్సిందే.ఇలాంటి సమయంలో రూపొందిన ఈ చిత్రంతో అఖిల్ చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
మొదట ఈ చిత్రంను డిసెంబర్లో విడుదల చేయాలని భావించారు.అయితే డిసెంబర్లో పెద్ద సినిమాలు విడుదల కాబోతున్న కారణంగా జనవరిలో రిపబ్లిక్ డే సందర్బంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు.
అఖిల్ ఈ చిత్రంతో మొదటి కమర్షియల్ సక్సెస్ను దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు.