తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పిసిసి అధ్యక్షుడు నియామకానికి సంబంధించి ఎప్పటి నుంచో ట్విస్ట్ ల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి.ఎప్పుడు ఈ పదవిపై కసరత్తు మొదలు పెడదాం అనుకున్నా, ఏదో ఒక ఇబ్బంది రావడం , నేతల మధ్య సయోధ్య కుదరకపోవడం, అలకలు, ఆగ్రహాలు, ఇలా ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది.
ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లోని సీనియర్లు, జూనియర్ నాయకుల మధ్య ఈ విషయంలో విభేదాలు పెరిగిపోయాయి.కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేయాలని అధిష్టానం చూసినా, కాంగ్రెస్ సీనియర్లు అడ్డుపడుతూ వచ్చారు.
ఎట్టకేలకు కొత్త పిసిసి అధ్యక్షుడు కి సంబంధించి రెండు మూడు రోజులుగా ఢిల్లీలో అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది.
ఈ నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు.
వీరిద్దరిలో ఎవరు పేరు అధిష్టానం ఫైనల్ చేస్తుందనే ఉత్కంఠ కొనసాగినా, చివరకు రేవంత్ రెడ్డి పేరును ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.అలాగే పిసిసి లోనూ కీలక పదవులు భర్తీ పైన ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
జీవన్ రెడ్డికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, మధుయాష్కీ గౌడ్ ను ప్రచార కమిటీ చైర్మన్ గా నియమిస్తారు అని తెలుస్తోంది.అలాగే ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి కీలకమైన పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.
అలాగే ఈ పిసిసి అధ్యక్ష పదవికి పోటీ పడినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఏఐసీసీలో కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు వెంకట్ రెడ్డి సైతం రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.ఈ కొత్త కార్యవర్గాన్ని ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది.తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న అధికార పార్టీ టిఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోగల వారికే అవకాశం కల్పించినట్లు గా కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి అయితేనే పార్టీని ఒక గాడిలో పెట్టడంతో పాటు , టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయగల సమర్థుడని అధిష్టానం నమ్మడంతోనే ఆయన పేరు ఫైనల్ చేసినట్టు అర్థం అవుతోంది.దీనిపై ఈ రోజే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.