తెలంగాణలో కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుంది.గత సంవత్సరం కంటే ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా నమోదు అవుతున్నాయి.
ఇప్పటికే సామాన్యుల నుంచి మొదలుకుని సినీ, రాజకీయ ప్రముఖుల వరకు కూడా కరోనా వైరస్ పలకరిస్తూ ఉంది.ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బందికి సెలవులు రద్దు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.
కోవిడ్ నేపధ్యంలో మున్సిపల్ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.కాగా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మున్సిపల్ శాఖ పేర్కొంది.
ఇకపోతే రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో, పట్టణాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని సూచించారు.మాస్కులు, శానిటైజర్లు వాడేలా ప్రజలకు కరోనాపై పూర్తి అవగాహన కల్పించాలని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.