పెళ్లి ఎక్కడ చేసుకుంటావ్ అని ఎవరైనా అడిగితే ఏ కల్యాణమండపమో లేదా ఏ గుడిల్లోనే అని చెబుతుంటాం.ఇంటి పరిసరాల్లో పెళ్లి, అతిథులకు విందు నిర్వహించడానికి స్థలం ఉంటే అక్కడే పెళ్లి జరుపుకుంటాం.
కానీ ఓ జంట మాత్రం ఎప్పుడూ పెళ్లి జరగని చోట, ఎవ్వరూ ఊహించిన చోట పెళ్లి చేసుకున్నారు.ఇంతకీ ఎక్కడ పెళ్లి చేసుకున్నారనే కుతూహలం పెరిగిపోతుందా ? ఆ కుతూహలానికి తెర వేసేద్దాం.ఆ జంట ఓ వైన్ షాప్ ఎదుట పెళ్లి చేసుకుంది.దానికి స్థానిక ఎంపీ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ విచిత్రమైన పెళ్లి కేరళలోని కోజికోడ్ ప్రాంతంలో ఇటీవల జరిగింది.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.
ఇంతకీ వీళ్లు వైన్ షాప్ ముందు ఎందుకు పెళ్లి చేసుకున్నారనేగా మీ డౌట్.ఆగండి ఆగండి అక్కడికే వస్తున్నాం.
ప్రస్తుతం దేశమంతా కరోనా నిబంధలు అమల్లో ఉన్నాయి.ఇప్పుడిప్పుడే లాక్డౌన్ నుంచి అన్లాక్ డౌన్ లోకి అడుగుపెడుతున్నాం.కరోనా ఉదృతి తీవ్రంగా ఉన్న ప్రదేశాల్లో లాక్ డౌన్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది.అలాగే కేరళలో కూడా కరోనా నిబంధనలు అమలులో ఉన్నాయి.
పెళ్లికి 50 మంది అని, అంత్యక్రియలకు ఇంత మంది అని అక్కడి ప్రభుత్వం నిబంధనలు పెట్టింది.గుంపులు గుంపులుగా ఉండకూడదని, మాస్క్ ధరించాలని ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
కానీ వైన్ షాప్లు ఓపెన్ చేసేందుకు కూడా అనుమతి ఇచ్చింది.అయితే వైన్ షాప్ల ఎదుట జనం గుమి గూడి ఉండటం, భౌతిక దూరం పాటించకపోవడం పట్ల ఈ జంట అసహనానికి గురైంది.పెళ్లికి కేవలం 50 మందికి అనుమతినిచ్చి, వైన్ షాప్ల ఎదుట ఎలాంటి నిబంధనలు అమలు చేయకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.దీనికి నిరసనగా అక్కడే అంటే వైన్ షాప్ ఎదుట పెళ్లి చేసుకోవాలని ఆ కొత్త జంట నిర్ణయం తీసుకుంది.
అనుకున్న ప్రకారమే దగ్గరగా ఉన్న ఓ వైన్ షాప్ ఎదుట లాంఛనంగా దండలు మార్చుకొని పెళ్లి తతంగం పూర్తి చేసుకుంది.