తెలంగాణాలో రాజకీయ పరిస్థితులు ఒకప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కంట్రోల్ లో ఉండేవి.ఆయన చెప్పిన విధంగా తెలంగాణాలో అన్ని కార్యక్రమాలు జరుగుతుండేవి.
ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ వరకు ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్టుగా వ్యవహారం నడిచేది.అయితే అదంతా మొదటిసారి తెలంగాణాలో అధికారంలోకి వచ్చినప్పుడు.
అయితే రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హవా పెద్దగా నడవలేదనే చెప్పాలి.ముఖ్యంగా తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ ఉన్నంతకాలం కేసీఆర్ కు ఎదురే లేకుండా పోయింది.
తొమ్మిదేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన నరసింహన్తో నలుగురు ముఖ్యమంత్రులు పనిచేశారు.ఏ ముఖ్యమంత్రితోనూ ఆయనకు బేదాభిప్రాయాలు లేవు.
గవర్నర్గా ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన అత్యవసరం అయితే తప్ప పెద్దగా జోక్యం చేసుకునే వారు కాదు.దీని కారణంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఉండేది.
అయితే ప్రస్తుతం తెలంగాణాలో టీఆర్ఎస్ హవాకు చెక్ పెట్టి తాము బలపడాలని చూస్తున్న కేంద్ర అధికార పార్టీ బీజేపీ గవర్నర్ నరసింహన్ ను తప్పించి ఆ స్థానంలో తమిళ సై ను నియమించడంతో ఇప్పడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందులే ఎదురయ్యాయి.కేసీఆర్ హవాకు చెక్ పెట్టేందుకు బీజేపీ పక్కా ప్లాన్ తో తమిళిసైను గవర్నర్గా నియమించారనే వాదనలు కూడా బయలుదేరాయి.
అంతా అనుకున్నట్టుగానే ఆమె గవర్నర్గా బాధ్యతలు తీసుకున్న రెండు నెలల్లోనే తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అప్పట్లో రాష్ట్ర సమస్యల గురించి గవర్నర్ నర్సింహన్ పెద్దగా పట్టించుకునే వారు కాదు.
అంతా ప్రభుత్వం ఇష్టం అన్నట్టుగా వదిలేసేవారు.కానీ కొత్త గవర్నర్ తమిళిసై మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆమె వెంటనే కేంద్రానికి నివేదిక సమర్పించారు.
రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మను పిలిపించి పరిస్థితిని సమీక్షించారు.రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కు ఫోన్ చేసి పరిస్థితులను చక్కదిద్దాలని సూచించారు.తనను కలిసిన ఆర్టీసీ కార్మికులకు కూడా ఆమె నేనున్నాను అంటూ భరోసా కల్పించారు.
దీనిపై నేరుగా ఆమె ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.గిరిజన తండాల్లో నిద్రించాలని, వారితో కలవాలని ఆమె నిర్ణయించారు.
ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్నిప్లాన్ చేసుకున్నారు.ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మె అలా కొనసాగుతుండగానే మరోవైపు తాము కూడా సమ్మెకు దిగాలని క్యాబ్ డ్రైవర్లు భావించారు.
వారు కూడా ఈ సమయంలో సమ్మె చేస్తే హైదరాబాద్లో, ప్రత్యేకించి ఐటీ ఏరియాలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించే ప్రమాదం ఉండేది.అయితే వీరంతా గవర్నర్ను కలిసి తమ బాధ చెప్పుకున్నారు.
దీంతో ఆమె మీ సమస్యలను నేను పరిష్కరిస్తానని, సమ్మె ఆలోచన మానుకోవాలని సూచించారు.ఇలా ప్రతి విషయంలోనూ ఆమె నేరుగా ప్రభుత్వానికి సంబంధం లేకుండా వ్యవహారాలు చేయడం కేసీఆర్ కు చాలా ఇబ్బందిగా మారినట్టు, దీనిపై ఆయన అసహనంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.