మిగతా విషయాల్లో ఎలా ఉన్నా, వినాయక చవితిని బహిరంగంగా జరుపుకునే విషయంలో ఏపీ సీఎం జగన్ ఆంక్షలు విధించారు.దీంతో ఏపీలో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
కేవలం హిందూ పండుగల విషయంలోనే ఈ విధమైన ఆంక్షలు విధించడం ఏంటి అనే ప్రశ్న తలెత్తింది.జగన్ ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి, హిందూ వ్యతిరేకి అనే ముద్ర పడిపోయింది.
దీనికి తగ్గట్టుగానే ఏపీలో హిందూ వ్యతిరేక వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకున్నాయి.ఆలయాలను ధ్వంసం , అంతర్వేది లో రథం దగ్ధం వంటి సంఘటనలు చోటు చేసుకోవడం వంటివి వైసీపీ ప్రభుత్వం పై హిందూ వ్యతిరేక ముద్ర పడడానికి కారణం అయ్యింది.
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కారణంగా కేంద్రం నిబంధనలు విధించడం , వాటిని తప్పనిసరిగా ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని షరతు విధించడంతో ఏపీలో వినాయక చవితి ఉత్సవాల పై ఆంక్షలు విధించారు.ఏపీ లోనే కాకుండా చాలా రాష్ట్రాల్లోనూ ఈ నిబంధనలు విధించారు.
మిగతా చోట్ల ఎలా ఉన్నా, ఏపీ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే జగన్ నిర్ణయం అందరికీ రుచించడం లేదు.కేవలం వినాయక చవితి ఉత్సవాలపై మాత్రమే ఈ నిబంధనలు విధిస్తారా ? పెళ్లిళ్లు, ఫంక్షన్లు, సినిమా హాళ్లు, బ్రాందీ షాపులు సంగతి ఏంటి అంటూ జనాల నుంచి ప్రశ్న ఎదురవుతోంది.హిందువుల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది అని జగన్ సైతం ముందుగా ఊహించలేకపోయారు.హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగ వినాయక చవితి.
ఈ పండుగ హడావుడి అంటే మామూలుగా ఉండదు.
ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో వేలాది మంది విగ్రహాలు తయారీ కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారు.ఏపీలో మిగతా విషయాల్లో జగన్ వైఖరి ఎలా ఉన్నా, వినాయకచవితి విషయంలో జగన్ ప్రభుత్వం తీవ్రంగా విమర్శలకు గురవుతోంది.ఏపీలో వైసీపీ రాజకీయ ప్రత్యర్దులయిన జనసేన, టిడిపి, బీజేపీలకు ప్రభుత్వంపై పోరాడేందుకు ఒక చక్కని అవకాశం ఏర్పడింది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మూడు పార్టీలు ప్రజాక్షేత్రంలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.పూర్తిగా ఈ ఉత్సవాలను రద్దు చేసే కంటే , షరతులతో ఉత్సవాలకు అనుమతిస్తే జగన్ ప్రభుత్వం ఈ స్థాయిలో విమర్శలు పాలు అయ్యేది కాదు.
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో జగన్ ప్రభుత్వం ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నా, ఈ విషయంలో మాత్రం తీసుకున్న నిర్ణయం జగన్ కి చెడ్డ పేరు తెస్తోంది.