ప్రతిరోజూ లక్షల్లో కేసులు.వేలల్లో మరణాలు, ఆసుపత్రుల ముందు అంబులెన్స్ల క్యూలు, ఆగకుండా మండుతున్న ఎలక్ట్రిక్ దహన వాటికలు.
ఇవి గతేడాది అమెరికాలో కనిపించిన పరిస్ధితులు.కోవిడ్కు భయపడాల్సిన అవసరం లేదని.
అది మామూలు జ్వరమేనంటూ ట్రంప్ లైట్గా తీసుకోవడంతో తానెంత డేంజరో కోవిడ్ రుచి చూపింది.చూస్తుండగానే చాప కింద నీరులా దేశం మొత్తం వైరస్ వ్యాపించింది.
జనం పిట్టల్లా రాలిపోవడంతో పాటు లాక్డౌన్తో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయింది.ఈ భూమ్మీద కోవిడ్తో తీవ్రంగా నష్టపోయిన దేశం ఏదైనా వుందంటే అది అమెరికాయే.
ఆ పరిస్ధితి చూస్తే.అగ్రరాజ్యంలో చివరికి ఎంతమంది మిగులుతారోనంటూ కామెంట్లు వినిపించాయి.
కానీ క్రమంగా పరిస్దితులు మెరుగుపడ్డాయి.టీకాలు అందుబాటులో రావడంతో పాటు అధ్యక్షుడు జో బైడెన్ ధృడ సంకల్పంతో అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది.
కానీ అయినవారిని, ఆత్మీయులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతం.ఏడాదిన్నర గడుస్తున్నా వారి జ్ఞాపకాలను తలచుకుంటూ కుమిలిపోతున్నారు బంధువులు.ఈ క్రమంలో కోవిడ్తో మరణించిన వారి జ్ఞాపకాలను శాశ్వతం చేయడానికి అమెరికా ప్రభుత్వం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.వారికి నివాళులర్పించేందుకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్ మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.20 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఉన్న ఈ మైదానంలో తమ వారి కోసం ప్రత్యేక మెసేజ్ రాసి వుంచిన తెల్ల జెండాలను ప్రదర్శించవచ్చు.అక్టోబర్ 3 వరకు ఇక్కడ తెల్ల జెండాలు పాతేందుకు అధికారులు అనుమతించనున్నారు.
ఈ కార్యక్రమానికి ఆర్టిస్ట్ సుజానే బ్రెన్నాన్ ఫిర్స్టెన్బర్గ్ రూపకల్పన చేశారు. సుజానే బ్రెన్నాన్ సోషల్ యాక్షన్ ఆర్టిస్ట్.తన వాలంటీర్ల బృందంతో కలిసి సుజానే ఈ జెండాలను ఏర్పాటు చేయడానికి 2,000 గంటల పాటు శ్రమించారు.దీనివల్ల కోవిడ్ మృతులకు నివాళులర్పించడంతో పాటు అమెరికాలో కరోనా వల్ల మరణాలను లెక్కించడానికి వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు.స్మారక చిహ్నానికి వ్యక్తిగతంగా హాజరుకాలేని వారు తమ సంస్మరణలను అధికారిక వెబ్సైట్ www.inamericaflags.org ద్వారా కూడా పంపవచ్చునని నిర్వాహకులు సూచిస్తున్నారు.1987 అనంతరం ఇదే అతి పెద్ద స్మారక కేంద్రంగా మారనున్నదని ఇక్కడి వారు చెబుతున్నారు.