హుజురాబాద్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కు పెద్ద చిక్కే వచ్చిపడింది.ఎన్నికల్లో గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీకి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం దక్కుతుంది అనే సెంటిమెంట్ కూడా ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ఇలా ఎవరికి వారు వ్యూహాలను రూపొందించే పనిలో ఉన్నాయి.
ఈ నియోజకవర్గంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఎవరికి వారు నిమగ్నమయ్యారు.ఇక అధికార పార్టీ టిఆర్ఎస్ ఈ నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.
గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోంది.ఇదంతా బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ను దృష్టిలో పెట్టుకుని టిఆర్ఎస్ చేస్తోంది. రాజేందర్ ఈ నియోజకవర్గం నుంచి 6 సార్లు గెలుపొందడం, మళ్ళీ ఎన్నికల్లో సెంటిమెంట్ ను ఉపయోగించుకుని గెలిచే అవకాశం ఉంది అనే సంకేతాలతో అధికార పార్టీ అప్రమత్తమైంది.ఇక రాజేందర్ విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో గెలుపు పై ఆయన ధీమాగా నే ఉన్నా, కెసిఆర్ రాజకీయ వ్యూహాలు బాగా తెలిసిన వ్యక్తి కావడం, దళిత బంధు వంటి పథకం తమకు ఇబ్బంది కరంగా మారుతుంది అని రాజేందర్ ఆందోళన చెందుతున్నారు.
దీంతో పాటు మిగతా సామాజిక వర్గాలను దగ్గర చేసుకునేందుకు టిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుండటం, ఇలా ఎన్నో అంశాలు రాజేందర్ కు ఆందోళన పెంచుతున్నాయి.టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఈటెల రాజేందర్ ఆ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు.
కేసీఆర్ కు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు.ఆ సమయంలోనే ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా రాజేందర్ తిరస్కరించారు.రెండోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఆ సమయంలో ప్రభుత్వం కు సంబంధించి ఆయన చేసిన విమర్శలు కెసిఆర్ కు ఆగ్రహం కలిగించాయి.
ఆ తర్వాత పరిణామాలు రాజేందర్ పై అవినీతి ఆరోపణలు రావడం ఆయన మంత్రి పదవికి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.ఇప్పుడు ఇక్కడ రాజేందర్ గెలిస్తేనే ఆయన చరిష్మా ఏమిటనేది తెలుస్తోంది.
ఒకవేళ ఓటమి కనుక ఎదురైతే రాబోయే రోజుల్లో రాజేందర్ రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
.