మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్తను మందిలించిన కారణంతో భార్యపై కిరోసిన్ పోసి తాను నిప్పంటించుకున్నాడు ఓ వ్యక్తి.వారిని కాపాడేందుకు వెళ్లిన కొడుకు, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి.
దంపతులిద్దరూ చనిపోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా ఉసిలంపట్టిలోని అల్లిగుండాం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
గ్రామానికి చెందిన జయరామ్ (38), కని (33) దంపతులకు ఇద్దరి పిల్లలు.కుమారుడు కవిన్ (15), కూతురు దర్శిని (13).
జయరామ్ ఓ లారీని కొనుక్కుని సరుకులను రవాణా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు.ఇదిలా ఉండగా ఇటీవల పొరుగు రాష్ట్రానికి సరుకు రవాణా చేసేందుకు వెళ్లినప్పుడు లారీ చెడిపోవడంతో మరమ్మతుల కోసం డబ్బులు తీసుకోవడానికి ఇంటికి వస్తాడు.
మంగళవారం రాత్రి స్నేహితుడితో మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య కని మద్యం ఎందుకు సేవించావని నిలదీసింది.గొడవ పెరగడంతో కోపంలో జయరామ్ ఇంట్లో నుంచి కిరోసిన్ తీసుకువచ్చి భార్యపై పోసి, తనపై కూడా పోసుకుని నిప్పంటించుకున్నాడు.
బాధ భరించలేక కేకలు వేయడంతో వాళ్ల పిల్లలు కవిన్, దర్శని కాపాడటానికి ప్రయత్నించే క్రమంలో వారికి గాయలయ్యాయి.స్థానికుల సాయంతో మంటలు ఆర్పి ఆ నలుగురిని ఉసిలంపట్టి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు.