క్షుద్ర పూజల గురించి మీరు వినే ఉంటారు.పదవి కోసమో, గుప్త నిధుల కోసమో, ఎదుటివారిపై కక్ష్య సాధింపు కోసమో క్షుద్రపూజలు చేయిస్తూ ఉంటారు.
అయితే తాజాగా క్షుద్ర పూజలకు సంబంధించిన ఒక ఘటన కలకలం సృష్టిస్తోంది.ఈ ఘటన ఎక్కడో మారు మూల పల్లెలో జరిగింది అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే.
ఎందుకంటే ఈ క్షుద్రపూజల ఉదంతం బాగా డెవలప్ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే చోటు చేసుకుంది.ఈ ఘటనతో స్థానిక ప్రజలందరూ ఉలిక్కిపడుతున్నారు.
ఈ ఘటనలో ఒక భర్త తన భార్యను చంపేయాలని ఓ భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు.అయితే అతడి నిజస్వరూపం భార్యకు తెలియడంతో క్షుద్రపూజల విషయం కూడా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని శేఖరంబంజరకు చెందిన కుమార్ అనే వ్యక్తి ఆటోడ్రైవర్ గా పని చేస్తున్నాడు.
కొన్నేళ్ల క్రితం ఒక మహిళతో వివాహం జరగడంతో పాటు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.ఆ తరువాత ఆమెను వదిలేసాడు.
నాలుగేళ్ల తరువాత మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు.కొన్నాళ్ళు గడిచాక ఆమె వద్ద ఉన్న డబ్బులు, నగలు అన్ని కాజేశాడు.
ఆపై రెండవ భార్య గోపిక కళ్లుగప్పి మరో మహిళను మూడో పెళ్లి చేసుకుని ఏకంగా కాపురం కూడా పెట్టేశాడు.అయితే తన మూడో పెళ్ళికి రెండో భార్య అడ్డువస్తోందని ఇబ్బంది పడిపోయాడు.
చివరికి ఆమెను కడతేర్చేందుకు క్షుద్ర పూజలకు ప్లాన్ రచించాడు.
అందుకోసం ఒక భూతవైద్యుడి సహాయం తీసుకుని తన ఇంట్లోనే రెండవ భార్య మరణానికి తాంత్రిక పూజలు జరిపించాడు కుమార్.అయితే ఈ క్షుద్ర పూజలను గమనించిన బాధితురాలు వెంటనే తనను కాపాడి తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.కానీ ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదట.
దీనితో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.ఆమెకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా అమ్మాయిలను మోసం చేస్తూ వారి జీవితాలతో ఆడుకునే ఈ నిత్యపెళ్లి కొడుకును కఠినంగా శిక్షించాలని అంటున్నారు.అలాగే ఈ ప్రబుద్ధుడి డెత్ ప్లాన్ లో చేతులు కలిపిన మాంత్రికుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.