తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించారు.గతంలో చేసిన పాదయాత్రలకు జనాల నుంచి విశేషమైన స్పందన రావడంతో పాటు, బిజెపి తెలంగాణలో మరింత బలోపేతం అయ్యేందుకు దోహదం చేసింది.
ఈ పాదయాత్రల ద్వారా బండి సంజయ్ కు బిజెపి అధిష్టానం దగ్గర మంచి క్రెడిట్ దక్కింది.ప్రధానమంత్రి నరేంద్ర మోది సైతం ఆయనను స్వయంగా అభినందించారు.
ఈ క్రమంలోనే ఉత్సాహంగా ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను సంజయ్ ప్రారంభించారు.ఈనెల 28 నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు ఐదో విడత యాత్ర సాగనుంది .
అయితే ఈ యాత్రను వీలైనంత తొందరగా ముగించాలని బిజెపి హై కమాండ్ నుంచి సంజయ్ కు సమాచారం అందినట్లు తెలుస్తోంది.మొత్తంగా బండి సంజయ్ పాదయాత్రను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికల్లా ముగించాలని, సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో, మిగతా పార్టీ వ్యవహారాలను చక్కబట్టాలని ఉద్దేశంతోనే సంజయ్ కు ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం అదీ కాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో, హై కమాండ్ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా అర్థమవుతుంది.
పాదయాత్ర త్వరగా ముగిస్తే జిల్లాల పర్యటనలు చేయించాలనే ఉద్దేశం లో బిజెపి అధిష్టానం ఉందట.
వాస్తవంగా బండి సంజయ్ పాదయాత్ర ఎప్పుడో ముగియాల్సి ఉంది.నాలుగో విడత యాత్రను పెద అంబర్ పేట్ లో సెప్టెంబర్ 22న ముగించారు .అక్టోబర్ లో ఐదో విడతను ప్రారంభించాలని భావించారు.కానీ ఆకస్మాత్తుగా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు రావడంతో , ఆ యాత్రకు బ్రేక్ వేశారు.దీంతో నవంబర్ 28న మళ్లీ 5వ విడత యాత్రను ప్రారంభించారు.
మొత్తం నాలుగు విడతల్లో సంజయ్ 13 పార్లమెంటు స్థానాలు, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, 21 జిల్లాల్లో 117 కిలోమీటర్లు మేర యాత్రను నిర్వహించారు.ఐదో విడతలో మూడు పార్లమెంటు , ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రను కొనసాగించే విధంగా షెడ్యూల్ ను రూపొందించుకున్నారు.
ఈ క్రమంలో పాదయాత్రను త్వరగా ముగించాలంటూ హై కమాండ్ ఆదేశాలు జారీ చేయడంతో, షెడ్యూల్ ప్రకారం అన్ని నియోజకవర్గాలను ఏ విధంగా కవర్ చేయాలనే విషయం పై సంజయ్ దృష్టి సారించారట.