అమెరికా… శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక రంగాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న దేశం.అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల ఫైనల్ డెస్టినేషన్ అమెరికాయే.
విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం ప్రతి ఏటా అగ్రరాజ్యానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.ఏదో ఒక రకంగా అమెరికాలో స్థిరపడి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రపంచం భావిస్తోంది.
ఇందులో భారతీయులు సైతం వున్నారు.అక్కడి వలసదారుల్లో అత్యంత శక్తివంతమైన, బలమైన కమ్యూనిటీ ఇండియన్సే.
అందుకే అప్పు చేసైనా సరే తమ పిల్లలను అమెరికా పంపిస్తున్నారు తల్లిదండ్రులు.
అక్కడ తమ పిల్లలు సంపాదిస్తుంటే ఇక్కడ గొప్పగా చెప్పుకోవడంతో పాటు ఆస్తుల్ని సంపాదించుకోవచ్చన్నది లక్షలాది మంది భారతీయ పేరెంట్స్ కల.అయితే ఈ కలను నెరవేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమించే వారు కొందరైతే.అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టాలని భావించేవారు ఇంకొందరు.
ఈ క్రమంలోనే బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు పెరుగుతున్నారు.
గత వారం అమెరికా- కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయులు మరణించిన ఘటన కూడా ఈ తరహాదే.
నలుగురు సభ్యుల కుటుంబం కెనడా నుంచి చట్టవిరుద్ధంగా అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించి సరిహద్దుల్లో గడ్డకట్టే చలిలో శవాలుగా తేలింది.
ఈ వ్యవహారం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.మరణించిన వారు గుజరాత్లోని గాంధీనగర్ జిల్లా డింగుచా గ్రామానికి చెందిన వారిగా ప్రచారం జరుగుతోంది.
అయితే దీనిని భారత్- కెనడా ప్రభుత్వాలు అధికారికంగా ధ్రువీకరించాల్సి వుంది.
డింగుచాకు చెందిన వారు పెద్ద సంఖ్యలో విదేశాలలో స్థిరపడ్డారు.
ప్రధానంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలలో వున్నారు.గ్రామంలోని పంచాయితీ భవనం, పాఠశాల, దేవాలయం, ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎన్ఆర్ఐలు విరాళాలు ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు.
వీరిని ఆదర్శంగా తీసుకుని పలువురు అవకాశాల కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు.అహ్మదాబాద్కు 40 కి.మీ దూరంలో వున్న డింగుచా గ్రామంలోకి అడుగుపెట్టగానే కెనడా, అమెరికాలో విద్యావకాశాలకు సంబంధించి హోర్డింగ్లు ఆకర్షిస్తాయి.ఇక్కడ అవకాశాలు లేకపోవడం వల్లే ప్రజలు విదేశాలకు వెళ్లడానికి కారణమని గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ఒకరు అంటున్నారు.
ఇటీవల టూరిస్ట్ వీసాపై గ్రామానికి చెందిన భార్యాభర్తలు, వారి ఇద్దరు పిల్లలు అదృశ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు.యూఎస్- కెనడా సరిహద్దుల్లో మరణించింది వీరి కుటుంబమేనని గ్రామస్తులు భావిస్తున్నారు.ఈ వార్త బయటకు వచ్చిన నాటి నుంచి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.అదృశ్యమైన వారిని జగదీశ్ పటేల్ అతని భార్య వైశాలి, వారి ఇద్దరు పిల్లలుగా చెబుతున్నారు.
జగదీశ్ పటేల్ కుటుంబం డింగుచాకి చెందినదేనని.ఆయన తల్లిదండ్రులు గ్రామంలోనే వుండేవారని.
కానీ జగదీశ్ మాత్రం ఇక్కడికి దగ్గరలోని కలోల్లో నివసించేవాడని గ్రామ రెవెన్యూ అధికారి చెబుతున్నారు.అయితే కోవిడ్ కారణంగా జగదీశ్ ఇటీవలే తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడని.
మళ్లీ రెండు నెలల క్రితం కలోల్కు వెళ్లిపోయారని అధికారి తెలిపారు.
ఇటీవల యూఎస్- కెనడా సరిహద్దుల్లో గడ్డ కట్టిన స్థితిలో ఒక చిన్నారి సహా నలుగురు భారతీయులు శవాలుగా తేలిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
భారత ప్రభుత్వంతో పాటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా.
మృతులు ఎవరన్న దానిని ఇంకా కెనడా అధికారులు గుర్తించలేదు.ఒట్టావాలోని భారత హైకమీషన్ కార్యాలయం, కెనడియన్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారు.