హుజురాబాద్ ఉప ఎన్నికలో తాము కచ్చితంగా గెలిచి తీరుతామని అధికార టీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది.‘దళిత బంధు’ స్కీమ్, అభివృద్ధి కార్యక్రమాలు తమను గట్టెక్కిస్తాయని గులాబీ నేతలు చెప్తూన్నారు.
అయితే, మరో వైపున హుజురాబాద్ వేదికగా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బాధితుల పోటీ రోజురోజుకూ పెరుగుతున్నది.ఈ మేరకు వారి ప్రకటనలు వెలువడుతున్నాయి.
ఇది ఏ పార్టీ లాభం చేకూరుతుందో మరి.
ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో తాము ఉండబోతున్నట్లు మిడ్ మానేరు నిర్వాసితులు ప్రకటించారు.తమ సమస్యల పట్ల ప్రభుత్వం కనుక స్పందించకపోతే బరిలో నిలబడి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పని చేస్తామని హెచ్చరించారు.తమకు టీఆర్ఎస్ సర్కారు నిధులు మంజూరు చేయడం లేదని, ఈ క్రమంలోనే హుజురాబాద్ బై ఎలక్షన్లో నిలబడి తమ సత్తా చాటుతామని ఎంపీటీసీలు చెప్తున్నారు.
ఇక తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఉపాధి హామీ అసిస్టెంట్లు కూడా బరిలో ఉండబోతున్నారు.తాజాగా ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల భార్యలు కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తాము బరిలో నిలుచుంటామని, కనీసం తమకు వితంతు పెన్షన్ కూడా సర్కారు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ డిమాండ్ల సాధన కోసం ధర్నాలు, ఆందోళన చేసినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసమాత్రంగానైనా స్పందించ లేదని వారు వాపోతున్నారు.ఈ నెల 7 లోపు తమ సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ సర్కారు పూనుకోకపోతే హుజురాబాద్ ఉప ఎన్నికలో వితంతువులనే పోటీకి దింపి పద్మశాలి సామాజిక వర్గ సత్తా ఏంటో చూపిస్తామని అధికార పార్టీకి హెచ్చరించారు.ఇందుకు జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు7 వరకు టీఆర్ఎస్ సర్కారుకు డెడ్ లైన్ ఇచ్చారు.
మొత్తంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా రోజురోజుకూ బాధితులు సమీకృతమవుతున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.ఇది ప్రతిపక్ష పార్టీ బీజేపీకి లాభం చేకూర్చే అవకాశాలు మెండుగా ఉంటాయని విశ్లేషిస్తున్నారు.