యాదాద్రి భువనగిరి జిల్లా: ఉన్న ఊరిని,కన్నతల్లిని, నమ్ముకున్న కుటుంబాన్ని వదిలి దేశం కోసం త్రివిధ దళాల సైనికులు పహారా కాస్తుంటారు.దేశమే తన కుటుంబమని అనుకుంటారు.
పుట్టిన మట్టికోసం దేనికైనా తెగిస్తారు.అలాంటి గొప్ప సైనికులు వీర మరణం పొందితే వారి కుటుంబాలను ఆదుకోవాలని,దేశం కోసం దేహాన్ని వదిలేసే ఆ మహనీయులను అందించిన కుంటుంబాలకు అండగా నిలబడాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ లో భారతీయ సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని,ఆ రాష్ట్రంలోని మండలా ప్రాంతంలో ఇది జరిగిందని ఈ ప్రమాదంలో ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోయారన్నారు.వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి ఒకరని అన్నారు.
ఆయన మృతి బాధాకరమని,వినయ్ భానురెడ్డి భార్య స్పందన ఆర్మీలో డెంటిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నారన్నారు.వీరికి ఇద్దరు కుమార్తెలు హానిక,హారిక ప్రస్తుతం మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరిలో నివాసం ఉంటున్నారన్నారు.
దేశం కోసం విధులు నిర్వహిస్తూ ప్రాణాలు విడిచిన వినయ్ భానురెడ్డి కుటుంబసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 50 లక్షల ఎగ్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ విషయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడాలని కోరారు.