ప్రపంచం మొత్తంలో కరోనా తొంగి చూడని ప్రాంతం ఏదైనా ఉందంటే అది లక్షద్వీప్ అని చెప్పవచ్చు.దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకున్నా ఒక్క కేసు కూడా రాకుండా కాపాడుకున్న ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రస్తుతం సీన్ రివర్స్ అయిందట.
కరోనా వచ్చిన ఇన్ని నెలల తర్వాత నిన్న తొలిసారిగా కరోనా మొదటి కేసు లక్షద్వీప్ లోని కవరట్టిలో నమోదైందట.వంటవాడిగా విధులు నిర్వహిస్తున్న ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కు చెందిన ఈ వ్యక్తి జనవరి 4న ఓడలో లక్షద్వీప్ కు బయల్దేరాడని, అక్కడికి చేరిన దాదాపు రెండు వారాల తర్వాత అతడికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఇక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం కరోనా సోకిన వ్యక్తిని గుర్తించి అతన్ని కొవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్టు తెలుస్తుంది.కాగా ట్రూనాట్ టెస్ట్ ద్వారా అతడికి కరోనా ఉన్నట్టు నిర్ధారించిన సిబ్బంది ప్రస్తుతం అతడిని కలిసిన వారి గురించి వెతుకుతున్నారని సమాచారం.ఇక ఇక్కడి ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 28న క్వారంటైన్ నిబంధనలను సడలించిన విషయం తెలిసిందే.అంతలోనే ఈ ప్రాంతంలో తొలి కేసు నమోదవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారట ఇక్కడి అధికారులు.