టీమిండియా దిగ్గజం, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తాజాగా ఓ పండంటి మగ బిడ్డకు తండ్రయ్యాడు.యువరాజ్ సింగ్ భార్య హేజల్ కీచ్ ఒక మగ బిడ్డకు తాజాగా జన్మనిచ్చింది.ఈ విషయాన్ని యువీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.“దేవుడు మాకు ఒక పండంటి మగబిడ్డను ప్రసాదించాడు.మా అభిమానులు, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరితో ఈ శుభవార్త షేర్ చేసుకుంటున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది.మేము మా చిన్నారిని ఈ ప్రపంచం లోకి ఆహ్వానించిన ఈ సందర్భంలో మీరు మా గోప్యతకు గౌరవం ఇస్తారని కోరుకుంటున్నాం.” అని యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు.ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
అభిమానులందరూ యువరాజ్ సింగ్-హేజల్ కీచ్ దంపతులకు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు.సెలబ్రిటీలు కూడా ఈ జంటకు కంగ్రాట్యులేషన్స్ తెలుపుతున్నారు.
2016వ సంవత్సరంలో యువరాజ్ సింగ్ బ్రిటిష్- మారిషియన్ యాక్ట్రెస్, మోడల్ హేజల్ కీచ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.2015లో యువరాజ్, హాజెల్ కీచ్ నిశ్చితార్థం జరగగా.నవంబర్ 2016లో పెళ్లయింది.గతేడాది నవంబర్ లో వీరిద్దరూ ఐదవ వివాహ వార్షికోత్సవం కూడా జరుపుకున్నారు. ఫిబ్రవరి 2021లో యువరాజ్ దక్షిణ ఢిల్లీలోని చత్తర్పూర్లో ఒక విలాసవంతమైన పెంట్ హౌస్ని కొనుగోలు చేశాడు.అయితే వ్యక్తిగత జీవితంలో బాగా సెటిల్ అయిన యువరాజ్ 2019లో క్రికెట్ నుంచి వైదొలిగాడు.
యువరాజ్ సింగ్ అక్టోబర్, 2000లో కెన్యాతో జరిగిన వన్డే మ్యాచ్తో ఇంటర్నేషనల్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు.ఆ సమయం నుంచి ఇండియా తరఫున 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20లు ఆడి ఎన్నో రికార్డులను నెలకొల్పాడు.2007 టీ20ఐ వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో ప్లేయర్ గా ఉన్నాడు. 19 ఏళ్ల పాటు భారత క్రికెట్కు సేవలందించిన తర్వాత యువరాజ్ జూన్ 10, 2019న అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.