ఎన్నారైలను లేదా వారి బంధువులను కిడ్నాప్ చేసి డబ్బులు అడగటం కొత్తగా పెరుగుతున్న నేరాల్లో ఒకటిగా నిలుస్తోంది.అయితే పంజాబ్ రాష్ట్రం, కపుర్తలాలో తాజాగా ఈ తరహా నేరం ఒకటి బయటపడింది.8 మంది దుండగులు కపుర్తలాలో ఒక వృద్ధుడిని కిడ్నాప్ చేసి, యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్న అతని కొడుకు నుంచి డబ్బును డిమాండ్ చేశారు.అయితే ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు చాలా చాకచక్యంగా ఈ 8 మందిని అరెస్టు చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడి పేరు గురిక్బాల్ సింగ్, అతను లఖ్వీందర్ సింగ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేయడానికి ఇతరులతో కలిసి పన్నాగం పన్నాడు.విజయవంతంగా లఖ్వీందర్ను కిడ్నాప్ చేశాక అతని కొడుకు నుంచి 3 కోట్ల రూపాయలు అడిగాడు.
అయితే పోలీసుల రంగంలోకి దిగి జనవరి 6వ తేదీన లఖ్వీందర్ ను వారి నుంచి విడిపించగలిగారు.ఈ కేసులో గురిక్బాల్ సింగ్, హర్మన్జిత్ సింగ్, గురుముఖ్ సింగ్, విజయ్ కుమార్లతో సహా 8 మందిని విచారణ కోసం అరెస్టు చేశారు.
ఈ కిడ్నాప్ వ్యవహారంలో మరో ఏడుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, అయితే వారిని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు మీడియాకి తెలిపారు.అరెస్టయిన వారి నుంచి లఖ్వీందర్ను కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన కారు, రివాల్వర్, ఇంట్లో తయారు చేసిన పిస్టల్, కొన్ని బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కాగా స్థానికంగానే కాకుండా భారతదేశం అంతా ఈ కిడ్నాప్ కేసు సంచలనంగా మారింది.