రాజకీయం అంటే ఆ మజానే వేరు.తమకున్న విశిష్ట అధికారాలతో తాము చెప్పిందే వేదం అన్నట్టుగా పరిపాలన చేస్తూ ఉంటారు.
రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తూ జీ హుజూర్ అనే పరిస్థితిలో ఉంటారు.ఎక్కడికెళ్లినా ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉంటుంది.
ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాజకీయాల మీద అందరికీ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది.అయితే ఇదంతా అధికారం లో ఉన్నంతసేపే.
అది లేకపోతే రాజకీయ నాయకులను పెద్దగా ఎవరూ లెక్కచేయరు.పవర్ కి ఉన్న పవర్ అదే.అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి.ఫలితాలకు చాలాకాలమే టైం ఉంది.
దీంతో వ్యవహారాలన్నీ అధికారులే చక్కబెడుతుండడం రాజకీయ నాయకులకు మింగుడుపడడంలేదు.
ఏపీలో పాలనలో పైచేయి కోసం ఆధిపత్య పోరు కొనసాగుతోంది.
సీఎస్ రివ్యూలపై వివాదం అంతకంతకు ముదురుతోంది.ప్రస్తుత పరిస్థితి అధికారులు వర్సెస్ రాజకీయ నేతలుగా మారిపోయింది.
సీఎస్ వరుస సమీక్షలను టీడీపీ నేతలు తప్పుపడుతుంటే సీఎస్ సమీక్షలు చేస్తే తప్పేంటని మరో వర్గం వారు ప్రశ్నిస్తున్నారు.రాష్ట్రంలో సీఎస్ ఓ వైపు ప్రభుత్వం మరోవైపు అన్నట్లు పరిస్థితి తయారైంది .ఎన్నికల ఫలితాలకు దాదాపు నెల రోజుల సమయం ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం సహా పలు అంశాలపై సమీక్షలు చేపట్టారు.ఆ సమీక్షలను ఎన్నికల సంఘం తప్పుపట్టింది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సమీక్షలు నిర్వహించరాదని, అధికారులెవరూ వాటికి హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేసింది.
ఇదే సమయంలో ఏపీలో నెలకొన్న అనేక అంశాలను గురించి సీఎస్ సీఎస్ వరుస సమీక్షలు చేపడుతుండడాన్ని ప్రభుత్వ పెద్దలతో పాటు టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
తాజాగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చేస్తున్న సమీక్షలపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.వచ్చే నెల 23న జరిగే ఓట్ల లెక్కింపుపై సీఎస్ సమీక్ష నిర్వహించడాన్ని ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు తప్పుపట్టారు.
బీజేపీ చెప్పుచేతల్లో పనిచేస్తున్న ఎన్నికల కమిషన్ సూచనలతో సీఎస్ సమీక్షలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.ఇలా ఒకటి కాదు సీఎస్ ఏ సమీక్ష చేసినా అలా ఎందుకు చేసారంటూ టీడీపీ నేతలు విమర్శలు చేయడం, దానికి అధికారులు సమాధానం ఇవ్వడం ప్రతిరోజు సర్వ సాధారణంగా మారిపోయింది.
ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు నిత్యం ఇదే తంతు కొనసాగేలా పరిస్థితి కనిపిస్తోంది.