రైతే రాజు అని నానుడి.అది కేవలం పుస్తకాలవరకే పరిమితం.
ఆ విషయం చెప్పిన ప్రభుత్వాలే వారిని పట్టించుకోవడం లేదు.అలాంటి తరుణంలో ఓ జంట వారి గోడిని విని బాధ్యత తీసుకొని ఎవరు చేయలేని పనిని చేసింది.
అవును. కరోనా రక్కసి ప్రపంచంపై పగ పట్టిన సమయమది.
కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఇంటిలోనే ఆఫీసుని ఏర్పాటు చేసుకుంటున్నారు.సరిగ్గా అదే సమయంలో వారు కూడా ఇంటి బాట పట్టారు.
చాలాకాలం తరువాత ఊరిలో అడుగుపెట్టిన ఆ దంపతులకు అక్కడ రైతుల కష్టాలు చూసి వారికోసం ఏదైనా చేయాలనిపించింది.అదే గొప్ప ఆవిష్కరణకు దారితీసింది.
వివరాల్లోకి వెళితే, సోనాలి–తుకారామ్ దంపతులు ఉద్యోగ పరంగా పుణెలో నివసిస్తున్నారు.వారి స్వగ్రామం అందేర్సల్.ఏ పండగలకో, పబ్బాలకో ఊరికి వెళ్లడం తప్ప.ఊరిలో ఎప్పుడూ వారు పెద్దగా గడిపింది లేదు.
అయితే కరోనా వైరస్ కారణంగా అందరిలాగే వారు కూడా తమ సొంతవారికి పయనమయ్యారు.ఈ సారి ఊరిలో ఉండటానికి మాత్రం వారికి చాలా తీరిక దొరికింది.
ఆ తీరిక ఎన్నో విషయాలు తెలుసుకునేలా చేసింది.నేడు రైతు పడుతున్న కష్టాలు ఆ ఊరిలో రైతులు కూడా పడుతున్నారు.
పెద్దరైతులు తప్ప రెండెకరాలు, మూడెకరాలు ఉన్న పేదరైతులు యంత్రాలను ఉపయోగించే పరిస్థితి లేదు.అలా అని అక్కడ పశువులు కూడా అందుబాటులో లేవు.
ఇది గమనించిన సొనాలి చిన్నరైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి భర్తతో మాట్లాడింది.దంపతులు ఇద్దరూ ఇంజనీర్లు కావడం ఇక్కడ మంచిదయింది.ఈ క్రమంలోనే వారికి ‘ఎలక్ట్రిక్ బుల్’ అనే ఆలోచన వచ్చింది.ఆలోచన వచ్చిందే తడవుగా రాత్రనకా, పగలనకా ఆ కాన్సెప్ట్పై పనిచేయడం మొదలు పెట్టారు.వారి కృషి ఫలించి ఎట్టకేలకు ‘ఎలక్ట్రిక్ బుల్’ తయారైంది.సాంకేతిక నిపుణుల బృందం ఈ యంత్రాన్ని పరీక్షించి ఓకే చెప్పింది.
తమ స్టార్టప్ కి ‘కృషిగటి’ అని పేరు పెట్టి ఎలక్ట్రిక్ బుల్ల అమ్మకానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు సోనాలి–తుకారామ్ దంపతులు.