అన్ని పార్టీల పరిస్థితి ఏపీలో కాస్తోకూస్తో పరవాలేదు అనుకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక సార్లు అధికారంలోకి వచ్చి రాజకీయ చక్రం తిప్పిన కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఏపీ తెలంగాణ విభజన తర్వాత పూర్తిగా దెబ్బతింది.చెప్పుకోవడానికి తప్ప పెద్దగా కార్యకలాపాలు ఉండకపోవడం, ఏ ఎన్నికల్లో ప్రభావం చూపించ లేక పోవడం, కేవలం చెప్పుకోవడానికి జాతీయ పార్టీ అనే గొప్ప తప్పించి , ఆ పార్టీని ఏపీలో బలోపేతం చేసే విధంగా కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించకపోవడం, ఇలా ఎన్నో కారణాలతో రోజురోజుకు కాంగ్రెస్ బలహీన అవుతూ వస్తోంది.
ఎప్పటి నుంచో ఏపీలో ఉనికి కోసం ఆరాటపడుతున్న బిజెపి కంటే , కాంగ్రెస్ మరింత బలహీనంగా ఉంది. 2014 , 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి రఘువీరారెడ్డి ఓటమి చెందారు.
ఇక అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.
ప్రస్తుతం ఆయన స్థానంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాకే శైలజానాథ్ ఉన్నారు .ఆయన కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని మెరుగుపరిచే విషయంలో అంతగా ఆసక్తి చూపించడం లేదు .ఏపీలో అనేక అంశాలపై పోరాటం చేసేందుకు అవకాశం ఉన్నా, ఆ పార్టీ నాయకులు ఎవరు ఉత్సాహం చూపించడం లేదు.పోనీ బలమైన కేడర్ కాంగ్రెస్ కు లేదా అంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అభిమానులు ఇంకా అనేక మంది ఉన్నారు.కాంగ్రెస్ పై ఉన్న అభిమానంతో ఏ పార్టీలోనూ వారు చేరకుండా ఇప్పటికీ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నారు.
అయితే వారందరినీ సరైన మార్గంలో నడిపిస్తూ, పార్టీని యాక్టివ్ చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టే నాయకత్వం లేకపోవడం వల్లే కాంగ్రెస్ ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది.

దీంతో శైలజానాథ్ ను మార్చి ఆ స్థానంలో బలమైన రెడ్డి సామాజిక వర్గం కు చెందిన వారికి కాంగ్రెస్ ఏపీ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించిందని , ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడం తో కాంగ్రెస్ ను యాక్టిివ్ చేసి టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు.ఇప్పుడు అదే ఫార్ములా కాంగ్రెస్ కోసం ఉపయోగించాలని చూస్తోంది.ఈ నేపథ్యంలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ కీలక నేతల పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది.
ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరును పరిశీలిస్తోంది.ఆయనకు ఉన్న క్లీన్ ఇమేజ్ తో పాటు , బలమైన రెడ్డి సామాజిక వర్గం కావడం తో ఆయన పేరును పరిశీలిస్తోంది.
అలాగే కాపు సామాజికవర్గం నుంచి మాజీ కేంద్రమంత్రి ఎం.ఎం.పల్లంరాజు పేరు కూడా పరిశీలనలోకి తీసుకున్నారట.అయితే రెడ్డి సామాజిక వర్గం కు చెందిన వారికే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు దక్కే అవకాశం కనిపిస్తోంది.