ఏ పార్టీ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు గా మారింది.చెప్పుకునేందుకు బలమైన పేరున్న నేతలు చాలామంది ఉన్నారు.
రాజకీయాల్లో తలలు పండిన సీనియర్లు ఎంతోమంది తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నారు.అయినా పార్టీ తెలంగాణను ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ప్రభావం చూపించలేకపోయింది.
రెండుసార్లు అధికారానికి దూరం అయింది.అలాగే తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ , ఉప ఎన్నికలు , ఇలా ఎందులోనూ కాంగ్రెస్ కు విజయం దక్కలేదు.
గతంలో ఉన్నంత బలం బలగం కాంగ్రెస్ కు పోయింది.ప్రధాన ప్రతిపక్ష పాత్రను ఇప్పుడు బిజెపి పోషిస్తోంది.
అంతేకాదు అధికారంలోకి వచ్చేందుకు అడుగులు వేస్తోంది.అయినా అటు పార్టీ అధిష్టానం కానీ, ఇటు తెలంగాణ నేతలు కానీ సరైన విధంగా వ్యవహారాలు చేయలేకపోతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిన్న మొన్నటి వరకు టిఆర్ఎస్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అంటూ పెద్ద హడావుడి నే నడిచింది.అయితే ఆయన బిజెపిలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రేపో మాపో ఆ పార్టీలో అధికారికంగా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.దీంతో ఇప్పటి వరకు ఈటెల పై ఆశలు పెట్టుకుని తెలంగాణలో బలపడాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి ఆ ఆశలు ఇప్పుడు లేవు.
ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లోకి వస్తాడు హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉప ఎన్నికలకు వెళ్లి పోటీ చేస్తారని భావించారు. ఒకవేళ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా, ఆయనకు తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేశారు.
అయితే ఇప్పుడు బిజెపి వైపు వెళ్లేందుకు , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.పోనీ కాంగ్రెస్ అభ్యర్థిని రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నారా అంటే అక్కడ గ్రూపు రాజకీయాలు ఎక్కువగానే ఉన్నాయి .ఆ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని లాభపడాలని టిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది.ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటనేది అందరికీ అనేక సందేహాలను కలిగిస్తోంది.ఎవరో వస్తారు పార్టీని ఏదో చేస్తారు అన్నట్లు కాంగ్రెస్ నేతలు ఎదురు చూపులు చూడడం తప్ప, ప్రస్తుతం ఉన్న నేతలు అంత సఖ్యతగా ఉండి పార్టీని బలోపేతం చేసే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టు గా కనిపిస్తున్నారు.