తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించేందుకు బీజేపీ కాంగ్రెస్ లు సిద్ధమయ్యాయి.ఈరోజు రెండు పార్టీలు విడివిడిగా సభలను నిర్వహించేందుకు తలపెట్టాయి.
ఈ సభల ముఖ్య ఉద్దేశం, నాయకుల ప్రసంగాలు అన్ని తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన పార్టీ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకున్న విధంగా ఉండబోతున్నాయి.రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా పక్కనపెట్టింది అని, పూర్తిగా ప్రజల మద్దతు కోల్పోయింది అనే విషయాలను హైలెట్ చేయడంతో పాటు , టిఆర్ఎస్ ముఖ్య నాయకుల వ్యవహారాలను ప్రస్తావించి ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ తగ్గే విధంగా చేసేందుకు, ఈ సభను ఉపయోగించుకునేందుకు సిద్దం అవుతున్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం పై పెరిగిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఉద్దేశం బీజేపీ కాంగ్రెస్ లలో కనిపిస్తోంది.
ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో గజ్వేల్ లో కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మగౌరవ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని దళితుల తోపాటు, గిరిజనులకు కూడా అమలు చేయాలనే డిమాండ్ తో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 దళిత గిరిజన ఆత్మగౌరవ సభను తలపెట్టింది.బిజెపి సైతం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం గా ప్రకటించాలని టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతోంది.
ఇంకా అనేక అంశాలపై ఈ రోజు సభను నిర్వహించబోతోంది.దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు.
త్వరలోనే హుజురాబాద్ ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, రెండు పార్టీలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.ఇటీవల కేంద్ర బిజెపి పెద్దలను తెలంగాణ సీఎం కేసీఆర్ కలవడం, తదితర పరిణామాలు బిజెపికి ఇబ్బందికరంగా మారడంతో ఇప్పుడు అమిత్ షా తో నే టిఆర్ఎస్ పై విమర్శలు చేయించి రెండు పార్టీల మధ్య ఎటువంటి పొత్తు లేదు అనే విషయాన్ని రుజువు చేసేందుకు బిజెపి ఈ సభను ఉపయోగించుకోబోతోంది.