తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా, బిజెపి నాయకుల హడావుడి , ఆ పార్టీ ఫ్లెక్సీలు, జెండాలతో హడావుడి నెలకొంది.బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా హైదరాబాదులో నిర్వహిస్తున్నారు.
వివిధ రాష్ట్రాల బిజెపి పాలిత ముఖ్యమంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున హాజరు కాబోతుండడంతో, ఆ స్థాయిలో భారీ ఏర్పాట్లు చేపట్టారు.అంతేకాకుండా ప్రధాని సభకు భారీగా జన సమీకరణ చేపట్టడం పైన దృష్టి సారించారు.
ఇప్పటికే దీనికి సంబంధించి కమిటీల నియామకం పూర్తయింది.అంతేకాదు జాతీయ స్థాయి నాయకులకు తెలంగాణలో జిల్లాలు, నియోజకవర్గాల వారిగా బాధ్యతలను అప్పగించడంతో ఢిల్లీ నుంచి వస్తున్న నాయకులు నేరుగా తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్తుండడంతో హడావుడి వాతావరణం నెలకొంది.
తెలంగాణలోని బిజెపి ముఖ్య నాయకులందరికీ ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించడంతో, హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఎక్కడ చూసినా బిజెపి నాయకుల సందడే కనిపిస్తోంది.వివిధ రాష్ట్రాలకు చెందిన బిజెపి కీలక నేతలంతా హైదరాబాద్ కు చేరుకుంటున్నారు.
హైదరాబాదులో మకాం వేయకుండా , నేరుగా తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్తున్నారు.వారికి జిల్లాల్లో ఘనంగా స్వాగతం పలికేందుకు ఆ జిల్లా బిజెపి నాయకులు పోటీ పడుతున్నారు.
బైక్ ర్యాలీలు , కార్ల ర్యాలీలు నిర్వహిస్తూ తమ బలాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు.

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల నిమిత్తం జిల్లాల వారీగా బాధ్యతలు స్వీకరించిన నేతలంతా మంచి పట్టున్న నాయకులు కావడం తో పాటు, ప్రజలను , పార్టీ నాయకులను ప్రభావితం చేయగలిగిన వారే.వీరంతా ఇప్పుడు జన సమీకరణ మీదనే దృష్టి సారించారు.ప్రధాని బహిరంగ సభను విజయవంతం చేసే విధంగా వీరు అప్పుడే వ్యూహాలను మొదలుపెట్టారు.
గ్రామాలు , మండలాలు , నియోజకవర్గాల వారీగా పరిస్థితులను అంచనా వేస్తూ , నాయకులకు తగిన సూచనలు ఎప్పటికప్పుడు చేస్తున్నారు.బిజెపి సభకు పోటీగా టిఆర్ఎస్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుండడంతో, దానిని తిప్పికొట్టేందుకు ఎక్కడకక్కడ బిజెపి నాయకులు ప్రయత్నాలు చేస్తుండడం తో హడావుడి వాతావరణం నెలకొంది.