అవును, మీరు విన్నది విడ్డూరంగా వున్నా ఇది నిజమే.అయితే అక్కడ ఇక్కడా దొంగతనం చేయడం వేరు, ఏకంగా పెళ్లి కొడుకు దగ్గర దొంగతనం వేరు.
వింటుంటే కిక్కు వస్తోంది కదూ.సాధారణంగా పెళ్లి వేడుకల్లో ఎంత హంగామా చోటు చేసుకుంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు.ఆ వాతావరణం దొంగలకు మంచి అనువుగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.చాలా చోట్ల పెళ్లి మండపాలలో జరిగిన దొంగతనాల గురించి మీరు వినే వుంటారు.అయితే తాజాగా జరిగిన దొంగతనం గురించి వింటే నవ్వి పోతారు.
ట్విస్ట్ ఏమంటే, ఇక్కడ ఏకంగా పెళ్లి కొడుకు మెడలో వున్న డబ్బుల దండను కొట్టేశాడు ఓ 14 సంవత్సరాల బాలుడు.
కాగా దాని విలువ ₹1,64,500.ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని మాయాపురిలో చోటుచేసుకోగా తాజాగా వెలుగు చూసింది.
అక్కడ స్థానికంగా పెళ్లి వేడుకలో భాగంగా వరుడు గుర్రంపై కూర్చోబోతుండగా ఓ బాలుడు చాలా గమ్మత్తుగా వరుడి దండను దొంగిలించాడు.అయితే ఈ కధలో వరుడి దండను దొంగిలించిన ఆ 14 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
దాంతో IPC (భారతీయ శిక్షాస్మృతి) సెక్షన్ 356, 379 ప్రకారం దొంగతనం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఘన్షామ్ బన్సాల్ మాట్లాడుతూ, దర్యాప్తు సమయంలో సమీప ప్రాంతాలలోని CCTV ఫుటేజీలను పరిశీలించామని, వాటి ద్వారా ఆ బాలుడు నిజంగానే ఆ దొంగతనం చేసినట్టు చెప్పారు.నిఘా వర్గాల ద్వారా, బాలుడిని హరి నగర్లోని అతని ఇంటిలోనే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.కాగా అతని నుండి మొత్తం 329 నోట్లలో డెబ్బై తొమ్మిది 500 నోట్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.