ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని ఎంతగా ప్రయత్నించినా, ఆ ఆశ మాత్రం తీరడంలేదు.ఎంతగా పార్టీలోని నాయకులను ప్రోత్సహించినా, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించినా, అవేమీ వర్క్ అవుట్ కావడం లేదు.
ఇక ఏపీలో ప్రధాన సామాజికవర్గం గా ఉన్న కాపులు, యూత్ ఓట్ బ్యాంక్ పుష్కలంగా ఉన్న జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకున్నా, బీజేపీకి ప్రత్యక్షంగా కలిసి వచ్చేది ఏమీ లేదు అన్నట్లుగా పరిస్థితి తయారైంది.బిజెపి తో పోలిస్తే జనసేన బాగా బలపడింది.
దీనికి తోడు ఏపీ బీజేపీ లో రెండు మూడు గ్రూపులు ఉండడం, ఒక గ్రూప్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, మరో గ్రూప్ వైసిపికి అనుకూలంగా ఉండగా, బిజెపిని బలోపేతం చేయడమే ఏకైక లక్ష్యంగా మరో గ్రూపు పని చేస్తున్నట్లుగా కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
ఇటువంటి కారణాలతో బీజేపీ బలపడడానికి అవకాశం లేకుండా పోతోంది.
ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు పార్టీ విధానాలను బలంగానే జనాల్లోకి తీసుకు వెళ్తూ, పార్టీలో క్రమశిక్షణకు మారుపేరుగా బీజేపీ విధానాలను అమలు చేస్తూ, పార్టీని ముందుకు తీసుకెళుతున్నా, ఆశించిన స్థాయిలో పార్టీ బలం పెంచుకోలేకపోతోంది.మొదట్లో కాస్త వీర్రాజు స్పీడ్ వర్కవుట్ అయినా ఆ తరువాత మళ్ళీ మొదటికే వచ్చినట్టుగా పరిస్థితి ఉంది.
వీర్రాజు వ్యవహార శైలిపై కొంతమంది అధిష్టానానికి ఫిర్యాదు చేసిన నేపథ్యం, ఇటీవల కొన్ని కొన్ని సంఘటనలు వివాదాస్పదం కావడం వంటి కారణాలతో బిజెపి అధ్యక్షుడిగా వీర్రాజు ను తప్పించి, ఆయనకు మరో కీలకమైన పదవి అప్పగించాలని, ఆయన స్థానంలో ఏపీ బిజెపి అధ్యక్షురాలు గా ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరికి బాధ్యతలు అప్పగిస్తే మంచిదనే అభిప్రాయం లో బీజేపీ అధిష్టానం ఉందట.ఆమె అయితే అందరిని కలుపుకు వెళ్లడమే కాకుండా , బిజెపిని ఏపీ లో బలోపేతం చేయగలరు అనే నమ్మకంతో బీజేపీ అధిష్టానం పెద్దలు ఉండటంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మార్పు వ్యవహారం తెరపైకి వచ్చినట్టు కనిపిస్తోంది.