మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలో ప్రచార వేడి పెరిగింది. టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచితే అదే స్థాయిలో బిజెపి నేతలు తగ్గేదేలే అన్నట్లు ప్రచారంలో దూసుకెళుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలందరికీ ప్రచార బాధ్యతలు అప్పగించారు.బీజేపీ నేతలు తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు.
భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్నారు.అవసరమైన చోట సభలు, సమావేశాల్లో పాల్గొని ప్రసంగిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పరిపాలన తీరు గురించి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎండగడుతూ సిఎం కెసిఆర్ గతంలో మునుగోడు నియోజకవర్గంలో ఇచ్చిన హామీ ఉపన్యాసాన్ని మొబైల్ ద్వారా వినిపించే ప్రయత్నం చేశారు.
మునుగోడు నియోజకవర్గం వెనుకబాటుతనం, ఫ్లోరైడ్ సమస్య, మూసీ నది సమస్యలతో పాటు ప్రజలెదుర్కొంటున్న సమస్యలను దశ దిశ వేదిక క్షేత్రంగా ప్రజల దృష్టికి తీసుకువచ్చారు బీజేపీ నేతలు.
ఇతర రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు నిలువరించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఖాతర్ చేయకుండా తాను చెప్పాల్సింది చెప్పడంతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు చప్పట్లతో మద్దతు తెలుపడంతో ముందుకు సాగడం కనిపించింది.మునుగోడు ఉప ఎన్నికలో అధికార టిఆర్ఎస్, బిజెపిల మధ్య మాటల యుద్ధం యథేచ్ఛగా కొనసాగుతోంది.మరోవైపు పార్టీ అధిష్టానం ప్రచారానికి ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో సహా రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్కుమార్తో సహా రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, మహిళా మోర్ఛా నాయకురాళ్లు, ఓబీసీ సెల్, ఎస్సీ సెల్, మైనారిటీ సెల్, బిజెవైఎం, ఎబివిపి నాయకులు మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.అయితే నాయకులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు.
ఇటు టిఆర్ఎస్ అటు కాంగ్రెస్లు సైతం మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారాన్ని తీవ్రతరం చేయడంతో పల్లె నుండి పట్టణం వరకు ప్రచార హోరు కొనసాగుతోంది.