ఏపీ శాసన మండలిని రద్దు చేయాలనే డిమాండ్ మొదట్లో వైసీపీ గట్టిగా వినిపించింది.ఈ మేరకు వైసీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడీ చేశారు.
అయితే ఇప్పుడు వైసీపీ సైలెంట్ అయిపోగా, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అదే పనిగా శాసనమండలిని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.బీజేపీ పైన ఈ విషయం లో ఒత్తిడి పెంచుతున్నారు.
దీంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో శాసనమండలిలో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవడంతో అసెంబ్లీలో మండలి రద్దు బిల్లు పెట్టి దానిని కేంద్రానికి పంపించారు.
మూడు రాజధానుల బిల్లు అప్పట్లో అసెంబ్లీలో ఆమోదం పొందగా, మండలిలో బ్రేక్ పడటంతో ఆగ్రహానికి గురైన జగన్ మండలి వల్ల పెద్దగా ఉపయోగం లేదనే అభిప్రాయంతో శాసన మండలి రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపించారు.
ఇక ఆ విషయం అంతా పక్కన పెట్టేసారు అనుకున్న సమయంలో, అనూహ్యంగా శాసనమండలిలో వైసీపీ బలం పెరగడంతో, టిడిపి, రెబల్ ఎంపీ రఘు రామ వంటివారు ఈ అంశాన్ని లేవనెత్తారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మండలి రద్దు చేయాలనుకుంటే దానికి ఆమోదం తెలిపి, ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి నెగ్గించుకోవాల్సి ఉంటుంది.అలాగే రాష్ట్రపతి దీనిపై సంతకం చేసి ఆమోద ముద్ర వేస్తే వెంటనే మండలి రద్దు అయిపోతుంది.
ఈ ప్రక్రియ సక్సెస్ అవ్వాలంటే కేంద్రమే తగిన నిర్ణయం తీసుకోవాలి.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మండలిని రద్దు చేసే అంతటి సాహసం బీజేపీ చేయదు.
ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాసనమండలి ఉంది.అలాగే చాలా రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల్లో శాసన మండలిని పునరుద్ధరించాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాయి.ఈ క్రమంలో ఈ వ్యవహారంపై సైలెంట్ గానే కేంద్రం ఉండే అవకాశం కనిపిస్తోంది.అదీ కాకుండా, జగన్ తో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మండలి రద్దు అంశాన్ని కేంద్రం పక్కన పెట్టేసే అవకాశం ఎక్కువగా ఉంది.