గత కొంతకాలంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు.ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోము వీర్రాజు ఏపీ బీజేపీని బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు.
క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ పార్టీలో అను మానాస్పదంగా వ్యవహరిస్తూ, ఇతర పార్టీలకు మేలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.పూర్తిగా బీజేపీ విధానాలను పాటించే వారికి మాత్రమే పార్టీలో స్థానం ఉంటుందనే సంకేతాలు పంపించారు.
ఇక పూర్తిగా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ వచ్చేవారు.అయితే బీజేపీ పెద్దలు వైసీపీ ప్రభుత్వం తో సన్నిహితంగా మెలుగుతూ ఉండటం వంటి కారణాలతో వీర్రాజు ఈ విధంగా వ్యవహరించినా, ఆ తర్వాత బీజేపీ వైసీపీ ప్రభుత్వాలకు మధ్య సన్నిహిత సంబంధాలు దెబ్బతినడంతో తన స్టాండ్ మార్చుకున్నారు.
ఇక ఆ తరువాత నుంచి వైసీపీ ని పూర్తిగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేసే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనంగా మారుతున్నారు.ఏపీ బీజేపీలోనే వీర్రాజు నాయకత్వాన్ని వ్యతిరేకించే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం, తరచుగా ఆయన పై అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది.
గోదావరి జిల్లాలకు చెందిన వీర్రాజు బలమైన సామాజిక వర్గం కు చెందిన వ్యక్తి కావడంతో పాటు, మొదటి నుంచి బీజేపీ లో ఉండడం … ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండడం వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే ఆయనకు అంతగా ప్రాధాన్యం కల్పించారు.అయితే ఈ మధ్య కాలంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, జాతీయ స్థాయిలో బీజేపీకి తలనొప్పులు తీసుకొస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఇటీవలి చీప్ లిక్కర్ అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే 50 రూపాయలకు క్వార్టర్ మందు అందిస్తామంటూ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా బీజేపీ అభాసుపాలైంది.జాతీయస్థాయిలో వీర్రాజు వ్యాఖ్యలు హైలెట్ కావడంతో బీజేపీ కి తలనొప్పులు తీసుకు వచ్చింది.అలాగే టిప్పుసుల్తాన్ వ్యవహారం తో పాటు, తాజాగా జిల్లాకొక ఎయిర్ పోర్ట్ అంశాన్ని ప్రస్తావిస్తూ, కడప జిల్లా పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాయలసీమలో వీర్రాజు వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది.అంతేకాకుండా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన ను కలుపుకుని వెళ్ళే విషయంలోనూ వీర్రాజు అంతగా ఆసక్తి చూపించక పోవడం .వీర్రాజు వైఖరి కారణంగానే జనసేన దూరంగా ఉంటోంది అనే సంకేతాలు అధిష్టానం కు వెళ్తుండటం ఇలా అనేక కారణాలతో వీర్రాజు వైఖరిపై బీజేపీ అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు ను తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.